ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభం కాగా... తొలి రోజు గవర్నర్ ప్రసంగం పూర్తి చేసి సమావేశాల్ని ఇవాళ్టికి వాయిదా వేశారు. ఇవాళ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతోంది. అయితే నిన్న సభలో చోటు చేసుకున్న పరిణామాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఫైర్ అయ్యారు. ముఖ్యంగా గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యుల వ్యవహారశైలిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న అసెంబ్లీ, మండలి సంయుక్త భేటీలో గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు జగన్ సూచన మేరకు వైసీపీ సభ్యులు నిలబడి నిరసనకు దిగారు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ గవర్నర్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన ప్రసంగం కొనసాగించారు. దీంతో 11 నిమిషాల పాటు వేచిచూసిన జగన్, వైసీపీ సభ్యులు సభను బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. దీనిపై ఇవాళ స్పందించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు సీఎంగా పనిచేసిన వ్యక్తి సభ్యత మరిచి ప్రవర్తించారంటూ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు తమ సభ్యుల్ని నియంత్రించాల్సింది పోయి సీట్లో జగన్ నవ్వుకుంటూ కూర్చొన్నారని స్పీకర్ అయ్యన్న ఫైర్ అయ్యారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగడానికి వీల్లేదని, ఇకపైనా జగన్ విజ్ఞతతో వ్యవహరించాలని స్పీకర్ సూచించారు. మరోవైపు ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇవ్వకుండా కోట్లు వృథా చేశారంటూ సాక్షి పత్రికలో వచ్చిన ఓ వార్తపై నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య ఫిర్యాదు చేశారు. సాక్షి మీడియాపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే డిమాండ్ పై స్పందించిన స్పీకర్ సభా హక్కుల నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు. ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos