అమరావతి రాజధాని విషయంలో ఐదేళ్లుగా సాగుతున్న అస్పష్టతకు, రాజకీయ వివాదాలకు శాశ్వతంగా ముగింపు పలికే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీ రాజధాని అమరావతి మాత్రమే అని అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా, దీనికి కేంద్ర చట్టబద్ధత కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు మార్చి 28న ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఏపీ సచివాలయంలో స్పీకర్ మాట్లాడుతూ... రాజధాని విషయంలో ఇప్పటివరకు ఉన్న 'లీగల్ గ్యాప్'ను భర్తీ చేయడమే ఈ స్పెషల్ సెషన్ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి, ఆ వెంటనే దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4 వరకు జరగనున్న నేపథ్యంలో, ఏపీ అసెంబ్లీ పంపే ఈ తీర్మానాన్ని వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టం చేయిస్తామని వెల్లడించారు. ఈ ప్రక్రియ గనుక పూర్తయితే, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత లభిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాజధానిని మార్చడం లేదా మూడు రాజధానుల పేరుతో గందరగోళం సృష్టించడం సాధ్యం కాదు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వుల మేరకు వెలగపూడి అసెంబ్లీ హాల్లో ప్రత్యేక సమావేశం జరుగుతుందని స్పీకర్ తెలిపారు.
మరోవైపు ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తుండటాన్ని వైసీపీ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ పరిణామాలపై ఆ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు ఆడుతున్న 'డ్రామా' అని ఆయన విమర్శించారు. కేవలం అసెంబ్లీని మాత్రమే ఎందుకు సమావేశపరుస్తున్నారని, మండలిని ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. రాజధానిని ఒక 'శాశ్వత కామధేనువు'గా మార్చుకుని చంద్రబాబు అక్కడ అవినీతి యజ్ఞం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో టెండర్లు ఖరారైన పనులకు మళ్లీ కొత్తగా టెండర్లు పిలవడం, డిజైన్ల పేరుతో రూ. 400 కోట్లు ఖర్చు చేయడం వెనుక పెద్ద గూడుపుఠాణి ఉందని ఆరోపించారు. జగన్ గారు ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకం కాదని, అందుకే అధికారంలోకి రాకముందే అక్కడ ఇల్లు కట్టుకున్నారని గుర్తు చేశారు. తాము ప్రశ్నిస్తోంది కేవలం అక్కడ జరుగుతున్న దోపిడీ, పారదర్శకత లేని పనుల గురించేనని అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos