అనంతపురం వేదికగా రేపు బుధవారం జరగనున్న 'సూపర్ సిక్స్-సూపర్ హిట్' విజయోత్సవ సభకు సర్వం సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరుకానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా పర్యవేక్షించారు. సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఆమె, భద్రతాపరమైన అంశాలపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రత విషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వొద్దని అధికారులను హోంమంత్రి అనిత గట్టిగా ఆదేశించారు. సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో డ్రోన్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. సభకు వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వేదిక నిర్మాణం, బారికేడ్ల ఏర్పాటు వంటి అంశాలపై కూడా అధికారులకు కీలక సూచనలు చేశారు. బుధవారం మధ్యాహ్నం జరగనున్న ఈ విజయోత్సవ సభకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఇతర కూటమి పార్టీల ముఖ్య నేతలు హాజరుకానున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. ప్రముఖుల పర్యటన, భారీ జనసమీకరణ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె వివరించారు.
అదేవిధంగా సభ ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రజల సమూహం అధికంగా తరలివచ్చే అవకాశం ఉండటంతో, ప్రతి చిన్న అంశంపైనా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా సభావేదిక నిర్మాణం, సౌండ్, లైటింగ్, విద్యుత్, తాగునీటి సౌకర్యం, పార్కింగ్, రవాణా సౌకర్యం, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య శిబిరాలు, అత్యవసర వసతులు వంటి ఏర్పాట్లపై అధికారులు, నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ సాధారణ సభ కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసానికి ప్రతీక అని ఆయన అన్నారు. ఈ సభలో లక్షలాది మంది హాజరయ్యే అవకాశం ఉంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రజలు సౌకర్యంగా పాల్గొనే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos