అనంతపురం జిల్లా తాడిపత్రి నగరం .. గత కొన్ని రోజులుగా రాజకీయ కక్షల నేపథ్యంలో అట్టుడుకుతోంది. ఓవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మరోవైపు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు తాడిపత్రిలో రాజకీయ వాతావరణాన్ని మరింత పెంచుతున్నారు. ఇదివరకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రావడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. కానీ, ఆ సమయంలో కూడా తాడిపత్రి నగరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తాజాగా ఆక్రమణలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి నోటీసులు జారీ చేసింది తాడిపత్రి మున్సిపల్ సిబ్బంది. ఇందులో భాగంగానే నేడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద సర్వే చేస్తామని నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
తాడిపత్రి పట్టణంలోని సర్వే నంబర్లు 639, 640, 641లో ఉన్న 10 సెంట్ల మున్సిపల్ స్థలం ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఈ స్థలం హద్దుల్లో ఉన్న పది ఇళ్లకు నోటీసులు జారీ చేశారు. ఇందులో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు కూడా ఉంది. ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలు, లింకు డాక్యుమెంట్లు తీసుకువస్తే హద్దులు నిర్ణయిస్తామని అధికారులు ఆ నోటీసులో స్పష్టం చేశారు. ఈ ఉదయం అధికారులు పెద్దారెడ్డి ఇంటి వద్దకు చేరుకుని మరోసారి సర్వే చేపట్టి, కొలతలు వేయడం ప్రారంభించారు. నోటీసులు ఇచ్చే సమయంలో పెద్దారెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన సిబ్బంది వాటిని అందుకుని, ఆయనకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంటనే తాడిపత్రికి బయలుదేరారు. అయితే, ఆయన రాక గురించి సమాచారం అందుకున్న పోలీసులు పెద్దారెడ్డిని పుట్లూరు వద్ద అడ్డుకున్నారు. మధ్యాహ్నం తర్వాతే తాడిపత్రిలోకి ప్రవేశించాలని అనంతపురం జిల్లా ఎస్పీ సూచించినట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ముందుజాగ్రత్త చర్యగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటితో పాటు, ఆయన రాజకీయ ప్రత్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. అధికారుల సర్వే, పోలీసుల బందోబస్తుతో పట్టణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos