గుంటూరు జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి ప్రయత్నించారన్న ఆరోపణలతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. తిరుమల లడ్డూ అంశంపై వైఎస్సార్సీపీ చేపట్టిన పాప ప్రక్షాళన పూజల కార్యక్రమంలో పాల్గొనేందుకు అంబటి రాంబాబు గోరంట్లకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు ఆయన వాహనాన్ని అడ్డుకుని నినాదాలు చేస్తూ ఉద్రిక్తత సృష్టించారు. పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ క్రమంలోనే అంబటి రాంబాబు సహనం కోల్పోయారు. దుర్భాషలాడుతూ.. సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడమే కాకుండా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా? లేకపోతే రాజకీయ ఒత్తిళ్లకు లోనైందా? అంటూ ప్రశ్నించారు. టీడీపీ ఫ్లెక్సీలకు పోలీసులు కాపలా కాస్తున్నారని ఆరోపించారు. ఇది ముందుగా ప్లాన్ చేసిన దాడి యత్నమని, కర్రలు, రాడ్లు పట్టుకుని టీడీపీ కార్యకర్తలు తిరుగుతున్నా పోలీసులు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. 'చంద్రబాబు కావాలనే అరాచక వాతావరణం సృష్టిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలా దాడులకు దిగడం తగదని' అంబటి వ్యాఖ్యానించారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు పల్నాడు జిల్లాలోనూ రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి విడదల రజిని బోయపాలెంలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న సమయంలో టీడీపీ నేతలు గుడి బయట హల్చల్ చేశారు. తిరుమల లడ్డూ అంశంపై టీడీపీ చేస్తున్న విష ప్రచారానికి నిరసనగా ఈ పూజలు నిర్వహించినట్లు వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. పూజలు జరుగుతున్న సమయంలో ఆలయం వెలుపల టీడీపీ కార్యకర్తలు నినాదాలతో ఉద్రిక్తత సృష్టించారు. అనంతరం విడదల రజినీ ఆలయం నుంచి బయలుదేరినప్పుడు ఆమె కారును అడ్డుకుని కదలనివ్వకుండా చేశారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడమే కాకుండా కారు ధ్వంసానికి కూడా యత్నించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
ఈ ఘటనపై విడదల రజిని ఘాటుగా స్పందించారు. తిరుమల లడ్డు విషయంలో టీడీపీ నాయకులు చేసిన తప్పుడు ప్రచారంతో కూటమి ప్రభుత్వం ప్రజల్లో తీవ్రంగా డ్యామేజ్ అయిందని ఆమె విమర్శించారు. "నేను కారు ఎక్కిన తర్వాత వాహనాన్ని కదలనివ్వకుండా దాడికి ప్రయత్నించారు. నాపై దాడి చేయాలని చూశారు. మా కార్యకర్తలు అప్రమత్తంగా స్పందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. టీడీపీ వాళ్ల ఉడత ఊపులకు భయపడే వాళ్లు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఓవరాక్షన్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని" ఆమె హెచ్చరించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos