రాబోయే పదేళ్లలో ఏపీ రాష్ట్రంలో 50 వేల నుంచి 1 లక్ష గదులను పర్యాటక రంగానికి అందుబాటులోకి తీసుకువస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. త్వరలోనే గోవా బీచ్ తరహాలో సూర్యలంక బీచ్ ప్రాచుర్యం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరంలో పాపికొండలు, ఫ్లెమింగో ఉత్సవాలు, గండికోట, అరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అరకు కాఫీని గ్లోబల్ బ్రాండ్గా తీర్చిదిద్దుతున్నామని పునరుద్ఘాటించారు. 9 జిల్లాల్లో 'ఏపీ ట్రావెల్ మార్ట్' పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. విజయవాడ పున్నమి ఘాట్ లో నిర్వహించిన ఆవకాయ్- అమరావతి ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు... యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే డెల్ఫీతో కలిసి ఉత్సవాల్లో పాలుపంచుకున్నారు. ఇరువురూ కలిసి కృష్ణాహారతిని తిలకించారు. అంతకుముందు కృష్ణా నదిలో హౌస్ బోట్ ను ప్రారంభించారు. తెలుగు సంస్కృతికి, ఆతిథ్యానికి ఆవకాయ్ ప్రతిరూపమని సీఎం అన్నారు.
అమరావతికి అపజయం అనే మాటే లేదు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి పట్టణాలు అమరావతిలో భాగమై ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, డైనమిక్ గ్రీన్ ఫీల్డ్ సిటీగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పర్యాటకులు రావాలంటే భద్రత, శుభ్రత ముఖ్యమని... ఆ దిశగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దసరా ఉత్సవాలను మైసూర్, కలకత్తా స్థాయిలో విజయవాడలో నిర్వహించగలిగామన్నారు. సంక్రాంతి పండుగ వేళ అందరూ తమ సొంత ఊళ్లకు వెళ్లి, జన్మభూమితో మమేకం కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని క్రియేటివ్ ఎకానమీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ ను టూరిజం డెస్టినేషన్ గా మారుస్తామని స్పష్టం చేశారు. అలాగే తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడటమే బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నామని అన్నారు.
విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించటంలోనూ, అభివృద్ధి, నైపుణ్యం, వ్యవసాయంలో ఏపీ దేశంలో ఓ కీలక రాష్ట్రంగా ఉందని యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వె డెల్ఫీ అన్నారు. ఆవకాయ్ ఫెస్టివల్ లో సీఎం తో కలిసి పాల్గోన్న ఆయన తెలుగు సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి దిగ్గజాలు సృష్టించిన ప్రాభవం అద్వితీయం అన్నారు. రాజమౌళి తీసిన సినిమాలు బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలను చూశానని తెలిపారు. నాటు నాటు పాట తనను ఎంతో ఆకర్షించిందని తెలిపారు. ఏపీకి చెందిన కూచిపూడి, కలంకారి, కొండపల్లి బొమ్మలు ప్రపంచాన్ని ఎప్పుడో ఆకర్షించాయని అన్నారు. కళలు, సినిమా, సాహిత్యం, సంగీతం వివిధ సమాజాలను దగ్గర చేస్తాయని స్పష్టం చేశారు. ఈయూ ఫిలిం ఫెస్టివల్ త్వరలో ఆంధ్రప్రదేశ్ లోనూ నిర్వహించేందుకు ఆలోచన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్, ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos