ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం ఒక కీలక కార్యక్రమానికి సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో.. ఒకే రోజు, ఒకేసారి 12 బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపనకు శ్రీకారం చుట్టనుంది. దీంతో రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు మరింత ఊపందుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బ్యాంకింగ్ కార్యకలాపాలకు ప్రత్యేక ప్రధాన కార్యాలయాలు లేవు. ప్రస్తుతానికి విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయాల ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి.. ప్రభుత్వం గతంలోనే ఉద్దండరాయునిపాలెం సమీపంలోని ఎన్10 రోడ్ వద్ద వివిధ బ్యాంకులకు స్థలాలను కేటాయించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు 3 ఎకరాలు, ఆప్కాబ్ కు 2 ఎకరాలు, కెనరా బ్యాంక్, యూబీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ వంటి ఇతర బ్యాంకులకు ఒక్కో బ్యాంకుకు 25 సెంట్ల చొప్పున స్థలాలు కేటాయించారు.
ప్రస్తుతానికి ఈ భూములను శుభ్రం చేసి, చుట్టూ కంచెలు ఏర్పాటు చేశారు. స్టేట్ బ్యాంక్కు కేటాయించిన స్థలంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఆ సభా వేదిక నుండి అన్ని బ్యాంకుల భవనాల నిర్మాణానికి ఒకేసారి శంకుస్థాపన జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, RBI గవర్నర్, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. బ్యాంకుల కార్యకలాపాలు విజయవాడ నుంచి అమరావతికి మారితే.. నగర వాణిజ్య, రియల్ ఎస్టేట్, రిటైల్ రంగాలు కూడా బలపడతాయని వాణిజ్య, వ్యాపార నిపుణులు అంటున్నారు.
ఈ ప్రధాన కార్యాలయాలను 14 అంతస్తుల భవనాలు, లక్ష చదరపు గజాల విస్తీర్ణం కలిగి నిర్మించనున్నారు. భవన నిర్మాణం పూర్తైన తరువాత, అన్ని బ్యాంకులు రాజధానిలోని తమ ప్రత్యేక కార్యాలయాల ద్వారా ఆర్థిక కార్యకలాపాలను నేరుగా నిర్వహించగలుగుతాయి. ఇటీవలి కాలంలో అమరావతిలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ ఉనికిని చాటుతున్నాయి. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి భూమిపూజ జరిగింది, అలాగే వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్కు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ చర్యలతో, అమరావతిలో వ్యాపార, హోటల్, ఆరోగ్య, బ్యాంకింగ్ రంగాల అభివృద్ధి వేగవంతం అవుతుందని వారు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos