ఏపీలో వచ్చే ఏఢాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ మరోసారి గెలుపే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. అందుకే రాష్ట్రంలో తాజా సర్వేల ఆధారంగా భారీ ఎత్తున ఇన్ ఛార్జ్ ల మార్పులు చేస్తున్న క్రమంలో... రేపల్లె నియోజకవర్గం ఇన్ ఛార్జి గా ఈపూరి గణేష్ ను నియమించడంతో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇప్పటివరకూ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ రేపల్లె ఇన్ చార్జ్ గా ఉన్నారు. ఆయన తన కుటుంబసభ్యుల్లో ఒకరికి టిక్కెట్ ఇప్పించాలనుకున్నారు. కానీ కొత్తగా ఈపూరి గణేష్ ను ఇన్ చార్జ్ గా నియమించారు. ఇప్పటివరకు రేపల్లెలో వైసీపీ అంటే మోపిదేవి వెంకటరమణ... మోపిదేవి వెంకట రమణ అంటే వైసీపీ అన్నవిధంగా ఉండేది. వైసీపీ పార్టీలో సెకండ్ లీడర్ అన్న పదమే లేకుండా అప్పటివరకు మోపిదేవి నాయకత్వం కొనసాగింది. ఒక్కసారిగా ఈపూరు గణేష్ ను నియోజకవర్గం ఇన్ ఛార్జి గా పార్టీ నియమించడంతో మోపిదేవి అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. మోపిదేవికి అన్యాయం జరిగిందని రోడ్డుపై టైర్లు తగులబెట్టి నిరసనకు దిగారు. నియోజకవర్గంలో నామినేట్ పదవులు ఉన్నవారు రేపల్లె పార్టీ ఆఫీస్ లో సమావేశమై ఇన్ చార్జ్ గా మోపిదేవి వెంకట రమణనే నియమించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఇన్ చార్జ్ గా ఈపూరి గణేష్ నియామకం పట్ల తమ నిరసనను వ్యక్తం చేస్తూ మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో చైర్మన్లు, ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, మార్కెట్ యార్డ్ ఛైర్మన్లు, మెంబర్లు ఉన్నారు. మోపిదేవి రమణ అభిమానులు సైతం తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాగా... టీడీపీకి కంచుకోటగా ఉన్న రేపల్లె నియోజకవర్గంలో వైసీపీ పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. రేపల్లెలో వైసీపీ ఇంతవరకు గెలవలేదు.1983 నుంచి ఇక్కడ టీడీపీ సత్తా చాటుతోంది. 1989, 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఇక మిగిలిన అన్నిసార్లూ టీడీపీ గెలిచింది. చివరి రెండు ఎన్నికల్లో రేపల్లెలో టీడీపీదే పైచేయి. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి అనగాని సత్యప్రసాద్ గెలుస్తూ... మోపిదేవి వెంకటరమణ ఓడిపోతూ వస్తున్నారు. మోపిదేవి రాజ్యసభకు వెళ్ళడంతో… రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే క్రమంలో తన వారసుడుని బరిలో దింపాలని ఆయన ప్రయత్నించారు. ఇప్పటికే మోపిదేవి వారసుడు రాజీవ్… రేపల్లెలో యాక్టివ్ గా పనిచేస్తూ వస్తున్నారు. అక్కడ పంచాయితీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ హఠాత్తుగా ... గతంలో రేపల్లె నుంచి ఎన్నికై టీడీపీలో మంత్రిగా పనిచేసిన ఈపూరు సీతారావమ్మ కుమారుడు డాక్టర్ ఈపూరు గణేష్ ను ఇన్ ఛార్జ్ గా నియమించడంతో మోపిదేవి అనుచరులు రగిలిపోతున్నారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఇంకా బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. మొత్తానికి నియోజకవర్గ ఇన్ ఛార్జిల నియామకాల తుట్టెను కదిపి జగన్ పెద్ద తప్పు చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos