ఏపీలో ఎండల తీవ్రత అధికమవుతోంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. రికార్డుస్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది. 40 డిగ్రీల ఎండ కాయడం సాధారణమైపోయింది. ఈ ఎండలకు వడగాల్పులు తోడవుతున్నాయి. వేడి గాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో వేడిగాలులు, ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి. బాపట్ల జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రెండు రోజుల కిందట జిల్లాలోని రావిపాడులో అత్యధికంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. నంద్యాల, కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇదే స్థాయిలో పగటి ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 119 ప్రాంతాల్లో ఎండ తీవ్రత 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. నేడు కూడా అదే తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రత రికార్డవుతుందని పేర్కొంది. మే నాటికి ఎండ తీవ్రత 45 డిగ్రీల వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వేడిగాలులు సైతం వేస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వేర్వేరు జిల్లాల్లో 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 68 మండలాల్లో వడగాలులు వీచినట్లు విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. వడగాలుల తీవ్రత నేడు కూడా కొనసాగుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 67 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొన్నారు.
నేడు వడగాలుల తీవ్రత అత్యధికంగా ఉండే జిల్లాల్లో విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. విజయనగరం - 11, పార్వతీపురం మన్యం- 10, శ్రీకాకుళం జిల్లాలోని 7 మండలాల్లో వీటి తీవ్రత అత్యధికంగా ఉంటుంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos