ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఉత్సవాల శోభ కనిపిస్తోంది. మొన్నటికి మొన్న విజయవాడ ఉత్సవ్ పేరుతో దసరా పండుగ సందర్భంగా హంగామా చేసిన ఏపీ ప్రభుత్వం, విజయవాడ ఉత్సవ్ లో నిర్వహించిన దసరా కార్నివాల్ లో నిర్వహించిన భారీ డప్పు ర్యాలీ గిన్నిస్ బుక్ రికార్డును సాధించింది. విజయవాడ ఉత్సవ్ లో వైబ్రెంట్ ఫర్ సొసైటీ ప్రతినిధులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును అందుకున్నారు. గిన్నిస్ బుక్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కార్నివాల్ లో భారీ డప్పు ర్యాలీ ఇప్పటివరకు ప్రపంచంలోనే ఎవరు నిర్వహించని కారణంగా డప్పు ర్యాలీకి గిన్నిస్ బుక్ లో స్థానం దక్కింది.
ఇక తాజాగా విజయనగర చారిత్రక వైభవాన్ని చాటేలా విజయనగరం ఉత్సవ్ నిర్వహించారు. విజయనగరంలో నిర్వహించిన విజయనగరం ఉత్సవ్ లో ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. నిన్న రాత్రి విజయనగరం పైడితల్లి ఆలయం వద్ద మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విజయనగరం ఉత్సవ్ లో భాగంగా ఏర్పాటు చేసిన లేజర్ షోను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. విజయనగరం ఔన్నత్యాన్ని, గత చారిత్రక వైభవాన్ని విజయనగరం ఉత్సవ్ చాటుతుందని అన్నారు. ఆధ్యాత్మిక చింతనకు, కళలకు, సంస్కృతి సంప్రదాయాలకు విజయనగరంనిలువెత్తు నిదర్శనమని, ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా విజయనగరం ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం పైడిమాంబ తల్లి దేవాలయం, సిరిమాను ఉత్సవాలు, రామతీర్థం, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన బొబ్బిలి వీణ వంటి ఎన్నో ప్రత్యేకతలతో విలసిల్లిన నగరం విజయనగరమని అన్నారు.
మహాకవి గురజాడ అప్పారావు, వయోలిన్ విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు, మల్లయుద్ధ ప్రవీణుడు కోడి రామమూర్తి తదితరులను ఆయన గుర్తు చేశారు. అద్భుత గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పాటల ఓనమాలు నేర్చుకున్న ప్రాంతమిదని అన్నారు. మధురగాయని సుశీలమ్మ గొంతెత్తి పాడిన ప్రాంతం కూడా ఇదేనని గుర్తు చేశారు. ఈ ఉత్సవ్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అదితి గజపతిరాజు తదితరులకు ఆయన అభినందనలు తెలిపారు. గడచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎటువంటి ఉత్సవాలు జరగలేదని, రాష్ట్రంలో కళలు విహీనంగా మారాయని గత ప్రభుత్వాన్ని విమర్శించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos