ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆరవ నిందితుడిగా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్రెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. ఇవాళ వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్నారు. వైసీపీ హయాంలో మద్యం క్రయ విక్రయాల్లో రూ.3,200 కోట్ల కుంభకోణం జరిగినట్లు సిట్ అధికారులు ధృవీకరించారు. ఈ లిక్కర్ స్కామ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఇటీవల టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో కోరడంతో పాటు ఇందుకు సంబంధించిన వివరాలను హోంమంత్రి అమిత్ షాను కలిసి అందించారు. ఈ నేపథ్యంలో సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. నిందితుల అరెస్టుపై దృష్టి సారించింది.
మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తొలుత ఈ కేసులో వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సాక్షిగా విచారణకు పిలిచిన అధికారులు.. చార్జిషీట్ లో మాత్రం నిందితుడిగా చేర్చారు. దీనిని బట్టి విజయసాయిని అప్రూవర్ గా మార్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తనను నిందితుడిగా చేర్చినట్లు తెలియగానే.. విజయసాయి మద్యం కుంభకోణానికి సంబంధించినంత వరకూ తనకు తెలిసిన ప్రతి విషయం, ఈ స్కాంతో సంబంధం ఉన్న అందరి గురించి చెబుతానంటూ ఓ ట్వీట్ చేశారు. దీంతో మద్యం కుంభకోణం విషయంలో విజయసాయి అప్రూవర్ గా మారిపోయారని అర్థమవుతున్నదని విశ్లేషకులు అంటున్నారు . అయితే ఇప్పటికిప్పుడు విజయసాయిరెడ్డిని పోలీసు అధికారులు విశ్వసించే అవకాశాలు లేవనీ, తాము దర్యాప్తులో కనుగొన్న అంశాలు, విజయసాయిరెడ్డి చెబుతున్న అంశాలూ బేరీజు వేసుకున్న తరువాత మాత్రమే ఆయన నిజాలే చెబుతున్నారని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే విజయసాయిని పోలీసులు విశ్వసించే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా ఈ కేసులో ఇప్పటికే కసిరెడ్డి రాజ్ తో పాటు ఏ8 చాణక్యను అరెస్టు చేశారు. ఇప్పుడు తాజాగా సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్త మద్యం పాలసీని అడ్డు పెట్టుకుని ప్రతినెలా రూ.60 కోట్ల మేర ముడుపులు సేకరించాలనే విషయంలో ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, నాటి ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి, ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, ఏపీఎస్బీసీఎల్ స్పెషల్ ఆఫీసర్ సత్య ప్రసాద్ తో కలిసి శ్రీధర్రెడ్డి కూడా కుట్రలు చేసినట్లుగా విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రానున్నరోజులలో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos