కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఇవాళ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టగా... దీన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇప్పుడు కేంద్రానికి ఈ తీర్మానం పంపి నిర్ణయం కోరనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కార్యాలయాల తరలింపు ఉండదని... అవి కర్నూలులోనే ఉంటాయని అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని... ఉత్తరాంధ్రలో విశాఖ, సీమలో కర్నూలు, తిరుపతి పట్టణాలను మరింత అభివృద్ధి చేస్తామని.. మూడు రాజధానుల పేరుతో గత ప్రభుత్వం మూడు ముక్కలాటలాడి ఏ ప్రాంతం అభివృద్ధి కాకుండా చేశారని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మేము విశాఖ, కర్నూలులో కూడా అమరావతే రాజధాని అని ఆ ప్రాంత ప్రజలను ఒప్పించామని.. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని... గతంలో చేశాం... మళ్లీ చేసి చూపిస్తామని అన్నారు.
రాయలసీమ ఎడారిగా మారుతుందన్న ఆవేదనతో కృష్ణా జలాలను సీమకు తరలించాలని ఎన్టీఆర్ ఆలోచించారని, . ఇందులో భాగంగానే తెలుగుగంగ, హంద్రీనీవా, నగరి గాలేరు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారని అన్నారు. వాటిని పూర్తి చేసేది కూడా ఎన్డీయేనే అని... నదుల అనుసంధానం చేసి, పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లను బసకచర్లకు తీసుకెళ్తే గేమ్ ఛేంజర్ అవుతుందని చంద్రబాబు అన్నారు. కియా పరిశ్రమను తీసుకొచ్చేందుకు యేడాదిలోనే గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశామని, కియా రాకతో అనంత జిల్లా ముఖచిత్రం మారిపోయిందని, హార్టికల్చర్ అభివృద్ధి చేస్తే మహర్ధశ వస్తుందని ఆయన అన్నారు. అనంతపురానికి బెంగళూరు ఎయిర్ పోర్టు, కర్నూలుకు హైదరాబాద్ ఎయిర్ పోర్టు, చిత్తూరుకు చెన్నై ఎయిర్ పోర్టులు దగ్గరగా ఉన్నాయి...ఈ మూడు అవకాశాలను అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చని... సీమలోనూ మంచి రోడ్లు వచ్చాయంటే టీడీపీ హయాంలోనే.. ఆ మంచి జరిగిందని అన్నారు. ఓర్వకల్లులో ఎయిర్ పోర్టు పెట్టాం.. తిరుపతి ఎయిరో పోర్టును విస్తరించి సర్వీసులు పెంచేలా చేశాం.. కడప ఎయిర్ పోర్టులో రాత్రి సమయంలోనూ విమానాలు దిగే అవకాశం కల్పించామని... నాలుగు ఉమ్మడి జిల్లాల్లో నాలుగు ఎయిర్ పోర్టులు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు.
అదేవిధంగా రాయలసీమలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని... తిరుపతిని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చుతున్నామని, తిరుపతి ఐఐటీ, ఐజర్, కర్నూలులో ట్రిపుల్ ఐటీ, ఉర్దూ యూనివర్సిటీ, అనంతపురంలో సెంట్రల్ వర్సీటీ పెట్టి ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చామని చంద్రబాబు అసెంబ్లీ వేదికగా వివరించారు. యువగళంలో ప్రకటించిన విధంగా మిషన్ రాయలసీమ హామీలను నెరవేర్చుతామని, హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు 90 శాతం రాయితీతో డ్రిప్ సబ్సీడీ ఇచ్చామని.. కానీ గత ప్రభుత్వం దాన్ని కూడా రద్దు చేసిందని అన్నారు. మళ్లీ రాయితీతో డ్రిప్ ను రైతులకు అందిస్తామని... గత ప్రభుత్వం రాయలసీమకు చీమంత మేలు కూడా చేయలేదని చంద్రబాబు తన సుదీర్ఘ ప్రసంగంలో విమర్శించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos