తెలుగు భాష వల్ల మనకు ఓ గుర్తింపు లభిస్తుంది అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ అన్నారు. మూడో ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో వైభవంగా జరుగుతున్నాయి. శనివారం మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ పాల్గొని ప్రసంగించారు. ఇంత పెద్ద తెలుగు సభ జరుగుతుందని తాను కలలో కూడా ఊహించలేదని చెప్పారు. మనిషికి పుట్టుకతోనే మా మాతృత్వ బంధం, భాషాబంధం ఏర్పడతాయన్నారు.
భాష కేవలం భావవ్యక్తీకరణకు మాత్రమే కాదు. ఒక ప్రపంచాన్ని సృష్టించేంత బలం భాషలో ఉందని జస్టిస్ శ్రీ నరసింహ తెలిపారు. మనందరం భాష వల్ల బంధువులమని అన్నారు. తెలుగు భాష వల్ల మనకు ఓ గుర్తింపు లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. అధికార వ్యవహారాల్లో తప్పనిసరిగా తెలుగు ఉండాలని, జిల్లా స్థాయి వరకు కోర్టు కార్యకలాపాలు తెలుగులోనే జరగాలని కోరారు. పాఠకులతో పుస్తకాలు తమదైనా బాంధవ్యాన్ని పెంపొందించుకుంటాయన్నారు. ప్రతిష్ఠాత్మకమైన పుస్తకమహోత్సవాన్ని ప్రారంభించే అవకాశం తనకు లభించడం అదృష్టమన్నారు. అంతేకాకుండా కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పద్యాన్ని ఆయన ప్రస్తావించారు. తన విద్యాభ్యాసమంతా ఆంగ్లమాధ్యమంలో జరిగిందని, తెలుగు మాట్లాడితే తరగతుల్లో కొట్టేవారని తెలిపారు. తన తండ్రి సూచన మేరకు ఈనాడు పత్రికను తెప్పించుకుని తెలుగు చదవడం, రాయడం నేర్చుకున్నానని జస్టిస్ శ్రీనరసింహ వెల్లడించారు.
రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కె. రఘురామకృష్ణంరాజు సభకు అధ్యక్షత వహించారు. ఎలక్ట్రానిక్ తెరలపై పుస్తకాలను చదవడం ఇబ్బందికరమైంది అందుకే నిజమైన పాఠకులంతా మళ్లీ పుస్తకాలవైపు మళ్లుతున్నారని కె. రఘరామకృష్ణంరాజు అన్నారు. త్వరలో టికెట్టుకొనైనా పుస్తక మహోత్సవాలకు హాజరయ్యే స్థాయిలో పుస్తకాల పట్ల ఆదరణ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో పుస్తకమహోత్సవానికి స్థలం కేటాయించే అంశాన్ని సానుకూలంగా పరిశీలించేలా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాలను పునరుజ్జీవింపజేయాలని, ప్రభుత్వాలకున్న పరిమితులను అర్థం చేసుకుంటూ, ఈ పనికి రాష్ట్రంలోని భాషాభిమానులూ, పుస్తకప్రియులంతా నడుంకట్టాలని పిలుపునిచ్చారు.
సాహిత్య అకాడమీ పురస్కార విజేత డాక్టరు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ పుస్తక ప్రచురణకర్తలు రచయితలకు పురుడుపోసే మంత్రసానిలాంటివాళ్లన్నారు. గూగుల్ గురువుకు ప్రత్యామ్నాయం కాదన్నారు. ఆత్మీయ అతిధిగా పాల్గొన్న సీపీఎం జాతీయ నాయకులు కె. నారాయణ మాట్లాడుతూ కొత్త రాజధాని అమరావతిలో పుస్తకమహోత్సవానికి పది ఎకరాల స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 12వ తేదీ వరకు జరగనున్న ఈ పుస్తక మహోత్సవంలో మొత్తం 314 స్టాళ్లను ఏర్పాటు చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos