ఏపీ శాసనమండలిలో విచిత్ర పరిస్థితి నెలకొంది. మా రాజీనామాలు ఆమోదించాల్సిందేనని ముగ్గురు ఎమ్మెల్సీలు శాసనసభలో ప్లకార్డులు చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. చైర్మన్ గారూ మేము స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు ఇచ్చాం .. ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని అడిగితే ఆయన వద్ద సమాధానం లేదు. చర్యలు తీసుకుంటామని చెప్పి తప్పించుకుంటున్నారు. కానీ ఇందుకూరి రఘురాజు అనే ఎమ్మెల్సీ విషయంలో అసలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించకపోయినా రాత్రికి రాత్రి అనర్హత వేటు వేశారు. హైకోర్టులో ఇబ్బంది పడ్డారు. అవసరం లేని అనర్హత వేటు వేసి.. రాజీనామా చేసిన ఎమ్మెల్సీల గురించి మాత్రం నిర్ణయం తీసుకోకుండా పెద్ద రాజకీయ డ్రామా ఆడుతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.
వైసీపీ ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కల్యాణ్ చక్రవర్తి తమ పదవులకు రాజీనామాలు చేసి నెలలు గడుస్తున్నాయి. కానీ శాసనమండలి ఛైర్మన్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. వారి ముగ్గుర్ని బతిమిలాడి అయినా పార్టీలోనే ఉంచుకుందామని ప్రయత్నిస్తున్నారు. వారు రాజీనామా చేసినప్పటి నుండి అనేక సార్లు రాయబారాలు నడిపారు. టీడీపీలో కూటమి పార్టీల్లో ప్రాధాన్యం ఉండదని వైసీపీలోనే ఉండాలని కోరారు. కానీ ఆ ముగ్గురూ నిరాకరించారు. పదవులు పోయినా పర్వాలేదు కానీ ... వైసీపీలో మాత్రం ఉండలేమన్నారు.
ఇంత ఛీ కొడుతున్నా వారి రాజీనామాలు ఆమోదించడానికి వైసీపీకి చెందిన చైర్మన్ మోషేన్ రాజు మొహమాట పడుతున్నారు. పార్టీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వస్తేనే ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికీ మండలిలో వైసీపీకి బలం ఉంది. అందుకే ఎమ్మెల్సీలు సభకు వస్తున్నారు. ఆ ముగ్గురు ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదిస్తే ఇంకా ఎంత మంది ఆ పని చేస్తారోనని వైసీపీ కంగారు పడుతోంది. ఎందుకంటే రాజీనామాలు చేస్తే ఒక్క పదవి కూడా తిరిగి వైసీపీకి రాదనే భయం ఆ పార్టీ అదిష్టానంలో గూడు కట్టుకుని ఉంది. శాసనమండలి చైర్మన్ ఒక్కసారి వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదిస్తే... ఇక ఆ పార్టీలో ఉన్న మిగిలిన ఎమ్మెల్సీలందరూ కూడా బయటికి వచ్చేస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos