ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రానికి నేడు బాంబు బెదిరింపు కాల్ రావడం అందరినీ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు వివిధ వార్తాసంస్థలు నివేదించాయి. ఈ బెదిరింపు కాల్ చెన్నైలోని CISF (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) కమాండెంట్ కార్యాలయానికి వచ్చినట్టు సమాచారం. దీంతో భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి.
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోపల తీవ్రవాదులు ఉన్నారంటూ, బాంబు పెట్టారంటూ తమిళనాడు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు ఆదివారం అర్ధరాత్రి ఫోన్ కాల్ రావడంతో షార్ కేంద్రంలో మరియు దాని చుట్టుపక్కల అడవుల్లో CISF బలగాలు, బాంబు స్క్వాడ్లు మరియు డాగ్ స్క్వాడ్లు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. అయితే, అధికారులు ఈ బెదిరింపు కాల్స్ ను ఫేక్గా నిర్ధారించారు. బాంబు బెదిరింపు దృష్ట్యా శ్రీహరికోటలో భద్రతా సిబ్బంది అడుగడుగునా గాలించారు. వారికి ఎక్కడా, ఎటువంటి ప్రమాదకర వస్తువులు లభించలేదు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఇతర బాంబు బెదిరింపు సంఘటనల నేపథ్యంలో ఆందోళన కలిగించినప్పటికీ ఎక్కడా ఏమీ లభించకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవల కాలంలో విజయవాడ, శంషాబాద్ విమానాశ్రయం మరియు ఎల్టీటీ ఎక్స్ప్రెస్కు వచ్చిన బెదిరింపులు భద్రతా ఆందోళనలను బాగా పెంచాయి. ప్రస్తుతం, షార్ కేంద్రంలో భద్రతను మరింత బలోపేతం చేసి, పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. సీఐఎస్ఎఫ్ బృందాలు పోలీసులు షార్ పరిసర ప్రాంతాలలో తనిఖీలు కొనసాగిస్తూ సముద్ర మార్గాల లోనూ తీరప్రాంత రక్షణ దళాలు తనిఖీలు చేపట్టాయి. నాయుడుపేట డీఎస్పి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలలో పాల్గొన్నారు. తనిఖీల అనంతరం బెదిరింపు ఫోన్ కాల్ ఆకతాయిలు చేసిన పనిగా భద్రతా బలగాలు తేల్చాయి. కాగా బాంబు బెదిరింపు నేపథ్యంలో సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos