గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. ఈ సారి గోదావరి పుష్కరాల నిర్వహణ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు నిర్ణయించారు. ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది. 2015 లో ఇదే గోదావరి పుష్కరాల ప్రారంభం వేళ చోటు చేసుకున్న ఘటనలు విషాదం మిగిల్చాయి. ఈ సారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
దీంతో గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో ప్రతిపాదనలు అధికార యంత్రాంగం సిద్దం చేసింది. కేంద్రం ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం నిధులు కేటాయించింది. ఇప్పటికే రూ 100 కోట్ల ను పుష్కరాల కోసం ప్రకటించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కల్పన కోసం తాజాగా రైల్వే శాఖ రాజమండ్రి రైల్వే స్టేషన్ కు రూ 271.43 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు నడుపుతామని.. ముందస్తుగానే ఖరారు చేస్తామని అధికారులు వెల్లడించారు. అఖండ గోదావరి పుష్కరాలు-2027 ముసాయిదా యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధమైంది.
రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ - టూరిజం, దేవాదాయ అధికారులు పుష్కర ఏర్పాట్ల పైన సమీక్ష చేసారు. మరో నాలుగు కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు. యాత్రికుల బస ఏర్పాట్లపై చర్చించారు. రాజమహేంద్రవరం పరిధిలో గోదావరి ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించారు. మొత్తంగా పుష్కర ఘాట్ల కోసం కావాల్సిన నిధుల పైన ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. నిధుల సమీకరణ తో పాటుగా గోదావరి ప్రాంతంలో సమగ్ర అభివృద్ధి యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గోదావరి పుష్కరాల పైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కార్యాచరణ ఖరారు చేయనున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos