ఏపీలో టమోటా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. టమాటా ధరలు దారుణంగా పడిపోవడంతో వాటిని పండించిన రైతుల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. గత ఏడాది రూ.లక్షల్లో ఆదాయం రాగా.. ఈసారి సీన్ రివర్స్ అయ్యిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో వ్యాపారులు కిలో టమోటాను మరీ దారుణంగా కేవలం రూపాయికి అడగటంతో రైతులు భగ్గుమన్నారు. ఆగ్రహంతో మార్కెట్ కు తీసుకువచ్చిన టమోటాలను అక్కడే యార్డులో నేలపై పారబోసి నిరసనకు దిగారు.
మార్కెట్లో గత రెండు రోజుల్లో టమోటా ధరలు దారుణంగా పడిపోయాయి. బుధవారం క్వింటా టమాటా గరిష్ఠంగా రూ.2,300 పలకగా .. కనిష్టంగా రూ.1,200 పలికింది. గురువారం క్వింటా ధర గరిష్ఠంగా రూ.300 మాత్రమే పలకగా.. కనిష్టంగా రూ.100కి దిగజారింది. దీంతో రవాణా ఛార్జీలు కూడా గిట్టుబాటు కావడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులు చాలా తక్కువ ధరకు వేలం పాడుతున్నారని, తాము వేలకు వేలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన టమాటా పంటకు గిట్టుబాటు ధర లేకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు.
దీనిపై మార్కెట్ యార్డు కార్యదర్శి మాట్లాడుతూ గురువారం మార్కెట్ కు నాణ్యత లేని సరకు రావడంతో వ్యాపారులు తక్కువ ధరకు అడిగారని ఆయన చెప్పారు. తోటల్లో సాగు చేసిన టమాటా క్వింటాలు ధర రూ.1,800 వరకు పలికిందని.. మెట్ట భూముల్లో సాగు చేసిన పంట నాణ్యత దెబ్బతింటోందని ఆయన చెప్పుకొచ్చారు. టమాటా మాత్రమే కాదు మరికొన్ని కూరగాయల ధరలు కూడా పడిపోయాయని అన్నారు. కాగా గత ఏడాది టమాటా ధరలు రికార్డులు క్రియేట్ చేసి కొనుగోలుదారులకు చుక్కలు చూపించగా.. ఈ ఏడాది ధగలు దిగజారిపోయి రైతులకు చుక్కలు చూపిస్తోందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos