రంజాన్ పండుగ సందర్భంగా రేపు జరగాల్సిన పదో తరగతి, ఇంటర్ పరీక్షలను ఏపీ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు అర్ధరాత్రి 12 గంటల తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఏపీలో ఈసారి రంజాన్ పండుగ రేపు శనివారం మార్చి 21న జరుపుకోవాల్సి ఉండటంతో ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన నారా లోకేష్.. కొత్త తేదీల్ని సైతం వెల్లడించారు. రేపు శనివారం ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్1 మరియు లాజిక్ పేపర్ 1 పరీక్షలు జరగాల్సి ఉంది. వీటిని ఈ నెల 25వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. అలాగే పదో తరగతి ధర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పరీక్ష కూడా రేపు జరగాల్సి ఉంది. దీన్ని ఏప్రిల్ 2వ తేదీకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. మిగతా పరీక్షలన్నీ యథాతథంగా జరుగుతాయి. కాబట్టి ఈ రెండు పరీక్షలు రాస్తున్న అభ్యర్ధులు మాత్రం ఈ కొత్త తేదీల్ని దృష్టిలో ఉంచుకోవాలి. మిగతా పరీక్షల్లో ఎలాంటి మార్పు లేదని, విద్యార్ధులు, తల్లితండ్రులు, అధికారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కోరారు.
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఈ నెల మార్చి 16న ప్రారంభం అయ్యాయి. ఈ ఏడాది మొత్తం 6.4 లక్షల మంది విద్యార్దులు ఈ పరీక్షలు రాస్తున్నారు. ఇందులో 6.22 లక్షల మంది రెగ్యులర్ విద్యార్దులు, మిగిలిన వారు ప్రైవేటు విద్యార్దులు ఉన్నారు. అలాగే ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకూ జరుగుతున్నాయి. ఈసారి మొత్తం 10.57 లక్షల మంది విద్యార్దులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్నారు. వచ్చే నెలలో ఈ రెండు పరీక్షల ఫలితాలు వెలువడుతాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos