ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పిడతల రామభూపాల్ రెడ్డి తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు తొలుత స్థానికంగా చికిత్స అందించి.. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు.
పిడతల రామభూపాల్ రెడ్డి అంత్యక్రియలను ఆయన స్వస్థలమైన గిద్దలూరులో శుక్రవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశముంది. పిడతల రామభూపాల్ రెడ్డి గిద్దలూరు రాజకీయాల్లో విశేష ప్రాధాన్యత సాధించారు. 1994లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి, అసెంబ్లీలో తన విలక్షణమైన పని తీరు తోనూ, ప్రజల సమస్యలపై గళం వినిపించడం ద్వారా మంచి పేరును సంపాదించారు. నిరాడంబర వ్యక్తిత్వం, ప్రజలతో నేరుగా కలసి సమస్యలు తెలుసుకునే స్వభావం ఆయనను ప్రజలకు చేరువ చేసింది. ఎన్నికల అనంతరం కొంతకాలం రాజకీయాల్లో చురుకుగా పని చేసిన ఆయన, తరువాత క్రమంగా ప్రజా జీవనానికి దూరమై కుటుంబ బాధ్యతలపై దృష్టి పెట్టారు.
రామభూపాల్ రెడ్డి రాజకీయ వారసత్వం ప్రస్తుతం ఆయన కుమారుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి చేతుల్లో కొనసాగుతోంది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తూ, వైసీపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే రామభూపాల్ రెడ్డి మరణ వార్తతో గిద్దలూరు ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పార్టీ నేతలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సామాజిక వర్గాల నాయకులు ఆయన సేవలను స్మరించుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అభ్యున్నతికి పనిచేసిన నాయకుడిని కోల్పోయామని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos