తిరుమల తిరుపతి దేవస్థానాల కొత్త చైర్మన్ గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. చైర్మన్ పదవి చేపట్టిన తర్వాత టీటీడీలో హిందువులు మాత్రమే ఉండాలని ఆయన ఓ ప్రకటన చేశారు. టీటీడీలో అన్య మతస్తులు అనే అంశం చాలాకాలంగా వివాదాస్పదంగా ఉంది. అన్యమతస్తుల్ని టీటీడీ నుంచి తప్పించాలని ఉద్యమాలు జరిగాయి. కానీ ఇప్పటికి అది నినాదంలాగే ఉంది.
2019 వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆ సమయంలో తిరుమలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఆయన ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి విచారణ చేశారు. అన్యమతస్తులు అని అనుమానం వచ్చిన టీటీడీ ఉద్యోగుల ఇళ్లకు కూడా వెళ్లి మరీ పట్టుకున్నారు. అంతకు ముందే మొత్తంగా 45 మంది ఉద్యోగుల్ని అప్పట్లో తప్పించినట్లుగా తెలుస్తోంది. అయితే వారు కోర్టుకెళ్లారు. తర్వాత ఎల్వీ సుబ్రహ్మణ్యం మొత్తం సంస్కరించే ప్రయత్నం చేశారు కానీ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా ఆయనను సీఎస్ పదవి నుంచి తప్పించారు. తర్వాత కొన్ని సందర్భాల్లో తిరుమలలో అన్యమత ఉద్యోగులు లేకుండా చేసేందుకు ప్రయత్నించినందుకే ఆయనను తప్పించారని కొంత మంది ఆరోపణలు చేశారు.
మరోవైపు 2020లో తిరుమలలో అన్యమత ప్రచారం చాపకింద నీరులా విస్తరించినట్లు గుర్తించారు. ఈ అంశంపై సీరియస్ గా దృష్టి సారించిన టీటీడీ గతంలో విచారణలు జరిపింది. అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్న వారిని గుర్తించి 69 మందితో కూడిన ఓ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో టీటీడీలో ఉద్యోగాలు చేస్తున్న వారితో పాటు టీటీడీలోనే పనిచేసి పదవీ విరమణ చేసిన మాజీ ఉద్యోగులు ఉన్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన పాలక మండలి బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని తీర్మానించింది. ఇందులో భాగంగా సదరు వ్యక్తుల కుటుంబాలను తిరుమల నుంచి పంపించాలని అనుకున్నారు. కానీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. తర్వాత ఏమయిందో ఎవరికీ తెలియదు.
ఐదేళ్లుగా అన్నప్రసాదం, తిరుమల లడ్డూలో నాణ్యత లోపించిందని, తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరుగుతోందని, ఇతర మతస్థులను టీటీడీలో ఉన్నత ఉద్యోగాల్లో నియమించారని, మాంసాహారం, గంజాయి, మద్యం వంటివి కొండపై విరివిగా దొరుకుతున్నాయని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. తిరుమలకొండ పవిత్రత దెబ్బతినే ప్రమాదముందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంస్కరణలు ప్రారంభించింది. ఈ క్రమంలో కొత్త చైర్మన్గా గీతలు చేపట్టిన రాజగోపాల నాయుడు మరింత పట్టుదలగా ఉన్నారు. అన్యమతస్తుల్ని పక్కకు తప్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీవారిపై నమ్మకం లేని వారికి స్వచ్చంద బదిలీలకు అవకాశం కల్పించాలని అనుకుంటున్నారు. మొత్తంగా అన్యమత ప్రచారం లేకుండా చేస్తే పవిత్రతను చాలా వరకు కాపాడినట్లేనని భక్తులు అనుకుంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos