కోరం లేకపోవడంతో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. మొత్తం 50 మంది పాల్గొనాల్సి ఉండగా, కేవలం 22 మంది హాజరయ్యారు. 50 శాతం కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి, జేసీ శుభం బన్సల్ తెలిపారు. సోమవారం తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ వైసీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు కిడ్నాప్ చేశారని, వారిని ఓటింగ్ కోసం విడుదల చేస్తే ఎన్నికల్లో పాల్గొంటామని వైసీపీ నేతలు చెబుతున్నారు.
షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం 11 గంటలకు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాల్సి ఉంది. కూటమి నుంచి డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా మునికృష్ణ బరిలోకి దిగగా, చివరి నిమిషంలో వైసీపీ అభ్యర్థిగా లడ్డు భాస్కర్ పేరు ప్రకటించింది. వైసీపీ మేయర్ అభ్యర్థి వైపు కార్పొరేటర్లు మొగ్గు చూపలేదు. కూటమి అభ్యర్థికి 30 మంది కార్పొరేటర్ల మద్దతు ఉందని తెలుస్తోంది. ఓటింగ్ లో 47 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులు పాల్గొనాల్సి ఉంది. అయితే ఓటింగ్ నిర్వహించడానికి అవసరమైన కోరం సభ్యులు హాజరుకాని కారణంగా డిప్యూటీ మేయర్ ఎన్నికను వాయిదా వేశారు.
ఎస్వీయూ పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాల్సి ఉంది. కూటమి పార్టీల కార్పొరేటర్లు ఎన్నికకు హాజరయ్యారు. వైసీపీ కార్పొరేటర్లు బస్సులో ఎస్వీ యూనివర్సిటీ వద్దకి వచ్చారు. ఒక్కసారిగా బస్సు పై దాడి చేసి కార్పొరేటర్లను కారులో తీసుకెళ్లారని ఆరోపిస్తూ.. వైసీపీ కార్పొరేటర్లు, మేయర్, ఎంపీ ఈ ఎన్నికను బహిష్కరించారు. తమ కార్పొరేటర్లను వదిలి పెడితేనే తాము ఓటింగ్ లో పాల్గొంటామని, లేకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో ఇక్కడ జరగాల్సిన డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది.
మరోవైపు రాష్ట్రంలోని నందిగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక, పిడుగురాళ్ల వైస్ ఛైర్మన్ ఎన్నిక, తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్, పాలకొండ నగర పంచాయతీ చైర్ పర్సన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos