ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధుల్ని విడుదల చేసింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం కింద ఇచ్చే రూ.15వేలలో రూ.2వేలు మినహాయించి ఒక్కొక్కరికి రూ.13వేల చొప్పున బ్యాంకుల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి మినహాయించిన రూ.2వేలు పాఠశాలల నిర్వహణకు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే తల్లికి వందనం పథకం కింద జమచేసిన రూ.13వేలు డ్రా చేసుకుందామని బ్యాంకులకు వెళ్లిన తల్లులకు ఊహించని పరిస్థితి ఎదురైంది.
తిరుపతి జిల్లాలో ఓ విద్యార్థి తల్లి ప్రభుత్వం జమ చేసిన తల్లికి వందనం పథకం డబ్బులు రూ.13 వేలు డ్రా చేద్దామని బ్యాంకుకు వెళ్లింది. ఆ మహిళకు అప్పటికే బ్యాంకులో పొదుపు రుణం బాకీ ఉందని చెప్పారు. దీంతో తల్లికి వందనం పథకం కింద ఇచ్చిన రూ.13వేలను ఆ రుణ బాకీ కింద జమ చేసినట్లు బ్యాంకులో అధికారులు చెప్పారు. తన కుమారుడి చదువు కోసం ఆ డబ్బులు ఎంతో అవసరమని.. రూ.13వేలు ఇవ్వాలని కోరినా ఒప్పుకోలేదు.. పాపం ఆమె బ్యాంకు నుంచి వెనక్కు వచ్చేశారు. ఆమె మాత్రమే కాదు.. మరికొన్ని చోట్ల కూడా తల్లులకు ఇదే పరిస్థితి ఎదురైంది.
ఏపీ ప్రభుత్వం పిల్లల చదువుల కోసం తల్లికి వందనం పథకం కింద జమ చేసిన డబ్బుల్ని.. తల్లుల అప్పుల పేరుతో బ్యాంకు అధికారులు జమ చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తల్లికి వందనం డబ్బుల్ని రుణం కింద జమ చేసుకోకుండా ప్రభుత్వం బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు. అయితే ఈ విషయంపై పలు జిల్లాల్లో విద్యాశాఖ అధికారులు స్పందించారు. తల్లికి వందనం డబ్బులు తీసుకోవద్దని బ్యాంకు అధికారులతో మాట్లాడతామని చెబుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని తల్లులు కోరుతున్నారు. మరోవైపు తల్లికి వందనానికి సంబంధించి షెడ్యూల్డ్ కులాల విద్యార్థిని, విద్యార్థులు లబ్ధి కోసం ఎన్సీపీఐను అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos