బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల కొద్దిరోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో దంచికొట్టాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షాలు పడ్డాయి. ప్రత్యేకించి కోస్తా జిల్లాలపై దీని తీవ్రత అధికంగా కనిపించింది. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ లక్షల క్యూసెక్కుల మేర వరద నీటిని డిశ్చార్జ్ చేశాయి.
ఇప్పుడు తాజాగా బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. దీని ఫలితంగా ఏపీలో మరో విడత విస్తారంగా వర్షాలు పడనున్నాయి. దీని ప్రభావంతో సోమవారం అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున 0.9 కిలో మీటర్ల ఎత్తులో ప్రస్తుత ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దీనితో పాటు నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న దక్షిణ తమిళనాడు తీరం మీదుగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించారు. వీటి ప్రభావంతో నేడు ఏలూరు, కృష్ణా, ఎన్డీఆర్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని సూచించారు.
అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. భారీ వర్షాలు పడేటప్పుడు, ఈదురుగాలులు వీచేటప్పుడు హోర్డింగులు, శిథిలావస్థలో ఉన్న భవనాలు, గోడల వద్ద తలదాచుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos