ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఘోరమైన ఓటమి ఎదురై... ఆ పార్టీ కేవలం 11 స్థానాలకు పరిమితమైన తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీ సీన్ మొత్తం మారిపోయింది. వైఎస్సార్సీపీ ముఖ్యమైన నేతలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి... కూటమిలోని పార్టీల్లో చేరిపోతున్నారు. ఇటీవల పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామా చేసి మరీ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల్లో చేరుతున్నారు. ఇలా వరుసగా వైఎస్సార్సీపీని నేతలు వీడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో ఇద్దరు నేతలు వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు.
వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ, కైకలూరు నియోజకవర్గానికి చెందిన నేత జయమంగళ వెంకటరమణ జనసేన పార్టీలో చేరారు. అలాగే మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మాజీ మున్సిపల్ ఛైర్మన్ గంజి చిరంజీవి కూడా అదే బాటలో నడిచారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇద్దరు వైసీపీ నేతలు డిప్యూటీ సీఎం, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇద్దరికి కండువాలు కప్పి పవన్ ... పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జయమంగళ వెంకటరమణ, గంజి చిరంజీవి మాట్లాడుతూ జనసేన పార్టీలో చేరడం ఆనందంగా ఉందని అన్నారు. కైకలూరుకు చెందిన జయమంగళ వెంకట రమణ గతంలో టీడీపీలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరగా.. ఎమ్మెల్సీ పదవి దక్కింది. అయితే ఇటీవల ఆయన పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. జనసేన పెద్దలతో చర్చించి పార్టీలో చేరారు.
అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన గంజి చిరంజీవి కూడా గతంలో టీడీపీలో ఉండగా.. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అయితే మంగళగిరి టికెట్ ఆశించగా.. చివరి నిమిషంలో దక్కలేదు. ఆయనకు ఆప్కో ఛైర్మన్ పదవి ఇచ్చారు. అయితే ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత గంజి చిరంజీవి పార్టీకి దూరంగా ఉంటున్నారు.. తాజాగా జనసేన పార్టీలో చేరారు. ఇటీవల మరికొందరు నేతలు కూడా వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్లు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ నుంచి ఇంకెంతమంది బయటికి వస్తారోనని ఆ పార్టీ అధిష్టానంలో నెలకొందని రాజకీయ విశ్లేషణలు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos