తెలుగు రాష్ట్రాల వాతావరణంలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అకాల వర్షాలు దంచికొట్టాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్ద మోకాళ్ల వరకు నీరు నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజ్ కాలువలు పొంగి రోడ్లలో ప్రవహించాయి.ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి ఒక్కసారిగా పెను గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కుప్పకూ లిపోయాయి. వైర్లు ధ్వంసం అవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో అన్నదాతలు నష్టపోయారు. కళ్లాల్లోని వరి, ధాన్యం వర్షానికి తడిచింది. ఈదురుగాలులకు బొప్పాయి, అరటి తోటలు దెబ్బతినగా పలుచోట్ల మామిడి తోటలో కాయలు నేలరాలాయి. పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వేసవి కాలంలో ఈ మాదిరిగా వర్షం పడటమేంటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షం ఈ మాదిరిగా కురవడంతో ఇంకా ఎండలు తీవ్రత పెరిగే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఉదయం వేళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. సాయంత్రం సమయంలో వర్షాలు కురుస్తున్నాయి. కాగా , ఉత్తర కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 38-42 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న రోజుల్లో విజయవాడ, గుంటూరు, కర్నూలు వంటి నగరాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos