ఉత్తరాఖండ్‌‌లో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో ఉత్తరకాశీలో గంగోత్రి వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అనంతపురం టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కుటుంబసభ్యులు ఒకరు చనిపోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ హెలికాప్టర్ ప్రమాదంలో అంబికా లక్ష్మీనారాయణ సోదరి వేదవతి కుమారి (48) చనిపోయారు.. బావ భాస్కర్ (51) తీవ్రంగా గాయపడ్డారు.. ఆయన రుషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

చనిపోయినవారిలో విజయా రెడ్డి అనే మరో తెలుగు మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో మొత్తం ఏడుగురు ఉన్నట్లు తెలుస్తోంది. అంబికా లక్ష్మీనారాయణ ఈ ఘటనపై సమాచారాన్ని తెలుసుకునే పనిలో ఉన్నారు.. ఉత్తరాఖండ్‌లో అధికారుల్ని సంప్రదిస్తున్నారు.

ఈ ప్రయివేట్ హెలికాప్టర్ ఉత్తరకాశీలో గంగోత్రి వైపు వెళ్తుండగా ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో.. ఏం జరిగిందో తెలియదు కానీ.. గంగ్నాని ప్రాంతం సమీపంలో ఒక్కసారిగా హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Videos