విజయవాడ కేంద్రంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వల్లభనేని వంశీ ఇప్పటికే జైలులో ఉన్నారు. కాగా, తాజాగా ముంబాయి నటి కేసులో అరెస్ట్ అయిన ఐపీఎస్ అధికారి మాజీ నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులుకు కోర్టు రిమాండ్ విధించింది. లిక్కర్ కేసులో రాజ్ కసిరెడ్డికి రిమాండ్ విధించటంతో.. ఈ ముగ్గురూ ఇప్పుడు విజయవాడ జైలులో ఉన్నారు. కాకతాళీ యమే అయినా... గతంలో వంశీ - పీఎస్సార్ మధ్య విభేదాలను విజయవాడ వాసులు గుర్తు చేసుకొంటున్నారు.
పీఎస్సార్ కు రిమాండ్ ఖైదీగా నెం. 7814ను కేటాయించారు. మద్యం కుంభకోణంలో అరెస్టై రిమాండ్ నిమిత్తం విజయవాడలోని జిల్లా కారాగారానికి వెళ్లిన రాజ్ కసిరెడ్డికి జైలు అధికారులు 7813 నెంబరు కేటాయించారు. వీరికి భద్రత దృష్ట్యా జైలు నిబంధనల మేరకు సింగిల్ సెల్లు కేటాయించారు. కసిరెడ్డిని ఒకటో బ్యారెక్లోని సెల్, సీతారామాంజనేయులుకు రెండో బ్యారక్లోని సెల్లో ఉంచారు. ఇతరులతో కలపకుండా భద్రతను దృష్టిలో పెట్టుకుని వారిని ఒంటిరిగానే ఉంచారు. తనకు ప్రత్యేకంగా సదుపాయాలు వద్దని, అందరిలా చూడమని పీఎస్ఆర్ చెప్పినట్లు సమచారం. రాజ్ కెసిరెడ్డి మాత్రం తనకు నడుం నొప్పి ఉందని జైలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
రిమాండ్ కోసం జైలుకు సీతారామాంజనేయులు వెళ్లినప్పుడు తనతో పాటు పూజకు కావాల్సిన వస్తువులను కూడా తీసుకెళ్లారు. తొలుత వీటిని జైలు అధికారులు సెల్లోకి తీసుకెళ్లేందుకు అనుమతించలేదు. పూజకు అనుమతించాలని పీఎస్ఆర్ కోరారు. ఇంతలో జైలు తనిఖీకి వచ్చిన డీఐజీ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అనుమతి కోరారు. ఇక.. ఇదే సమయంలో మరో ఆసక్తికర అంశంపై విజయవాడలో చర్చ జరుగుతోంది. గతంలో సీతారామాంజనేయులు విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పనిచేసిన సమయంలో వల్లభనేని వంశీ టీడీపీలో ఉన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయం అది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య పలు అంశాలపై వివాదాలు నడిచాయి. దీంతో ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో రిమాండ్ పొడిగింపు కోసం వంశీ, ముంబయి నటి కేసులో ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు బుధవారం ఒకే సమయంలో ఒకే కోర్టుకు వచ్చారు. నటి కేసులో వాదనలు పూర్తయి తీర్పు కోసం పీఎస్ఆర్ ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో రిమాండ్ పొడిగింపు కోసం వంశీ వచ్చారు. అనంతరం ఇద్దరూ ఒకే జైలుకు వెళ్లారు. నాడు పీఎస్సార్ పైన వంశీ తీవ్ర ఆరోపణలు చేసారు. పీఎస్సార్ నుంచి తనకు ప్రాణహాని ఉందని అప్పట్లో ఫిర్యాదు చేసారు. ఆ తరువాత పీఎస్సార్ బదిలీ పైన హైదరాబాద్ వెళ్లారు. గతంలో ఇద్దరు బద్ద శత్రువులుగా ఉన్న వీరిద్దరు ఇప్పుడు ఒకే జైలులో గడపాల్సి రావడంపై సర్వత్రా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos