ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూకబ్జాలపై విజిలెన్స్ నివేదిక సిద్ధం చేసింది. ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల ప్రకారం 295, 296 సర్వే నంబర్లలో 23.69 ఎకరాల పట్టా భూమి పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఉంది. అయితే ఆ ఫ్యామిలీ పక్కన ఉన్న అటవీ భూమిని ఆక్రమించి మొత్తం 104 ఎకరాలను వ్యవసాయ క్షేత్రంగా మార్చి చుట్టూ కంచె వేసినట్లు విజిలెన్స్ విభాగం నిర్ధారించింది. దాంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం మంగళంపేట రక్షిత అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి కబ్జాలు నిజమేనన్న ఆరోపణలకు ఊతమిస్తోంది.
ఏడు రకాల ఆధారాలతో విజిలెన్స్ నివేదిక రూపొందించింది. వారికి ఉన్న భూములకు అదనంగా 77.54 ఎకరాలు రిజిస్టర్ చేసుకున్నట్లు విజిలెన్స్ తేల్చింది. తన పేరిట, కుమారుడు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఇతర కుటుంబసభ్యుల పేరిట భూములు రిజిస్టర్ చేశారని.. రాజకీయ పలుకుబడితో ఇదంతా చేశారన్న విషయాలు దర్యాప్తులో తేలడంతో అటవీ, రెవెన్యూ భూములు ఆక్రమించుకున్న పెద్దిరెడ్డి సహా ఆయన కుటుంబసభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి విజిలెన్స్ విభాగం సిఫారసు చేసింది.
ఇక ప్రభుత్వం రెవెన్యూ, అటవీ అధికారులతో సంయుక్తంగా సర్వే చేయించి పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు అసలు ఎన్ని ఎకరాల భూములు ఆక్రమించుకున్నారో తేల్చాల్సి ఉంది. పెద్దిరెడ్డి కుటుంబంతో పాటు అక్రమాలకు పరోక్షంగా సహకారం అందించిన రెవెన్యూ, అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కబ్జాకు గురైన అటవీ, రెవెన్యూ భూమిని గుర్తించి ఏపీ ప్రభుత్వం తిరిగి వాటిని స్వాధీనం చేసుకోవాలని విజిలెన్స్ తమ రిపోర్టులో ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ విషయంలో చివరాఖరుకు ఏం తేలుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos