విశాఖపట్నంలో వైఎస్సార్సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు, 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి వైఎస్సార్సీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన త్వరలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు. వంశీరెడ్డి రెండు రోజుల క్రితం మధ్యాహ్నం రామ్నగర్లోని ఒక హోటల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారని ప్రచారం జరిగింది. అయితే ఇంతలోనే తిరిగి జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన మొదట టీడీపీలో చేరారని వార్తలు వచ్చినా, ఆ తరువాత జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వంశీరెడ్డి నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
గత ప్రభుత్వ హయాంలో వంశీరెడ్డి తన తండ్రి గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. వంశీరెడ్డి 74వ వార్డు కార్పొరేటర్గా ఉంటూ తన వార్డులో ప్రభుత్వ భూములను ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి. వంశీరెడ్డి దయాల్ నగర్ కొండపై ఇళ్లు నిర్మించుకున్న వారి నుంచి డబ్బులు డిమాండ్ చేశారని.. వారు ఇవ్వనందుకు జీవీఎంసీ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి వారి నిర్మాణాలను కూల్చి వేయించారని ఆరోపణలు వచ్చాయి.
అదేవిధంగా పెదగంట్యాడలో ప్రైవేటు భూమి కొనుగోలు చేసిన వ్యక్తులు దాని పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అయితే వారిని బెదిరించి వంశీరెడ్డి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అదే భూమిలో గతంలో తన అనుచరుడిగా ఉన్న వ్యక్తి కళ్యాణ మండపం నిర్మిస్తుంటే అధికారులను అటువైపు వెళ్లకుండా ఒత్తిడి తెచ్చారని.. ఆ తర్వాత రెవెన్యూ అధికారులు కల్యాణ మండపాన్ని తొలగించారంటున్నారు. అదే సర్వే నంబర్లో వంశీరెడ్డి కొన్ని షెడ్లు నిర్మించి అద్దెకు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటిని తొలగించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ షెడ్లను కాపాడుకునేందుకు వంశీరెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని.. అందుకే వైఎస్సార్సీపీని వీడి జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. చివరకు ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos