ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుదీర్ఘ కాలంగా సాగుతున్న విచారణ పైన సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణ కాల పరిమితి ముగియటంతో ఇక ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరం ఉందా లేదా అనే అంశాన్ని తేల్చి చెప్పాలని సీబీఐకి సుప్రీం సూచించింది. దర్యాప్తు అవసరం అయితే ఎవరెవరిని విచారించాల్సి ఉందో వివరాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎవరిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేయాలనుకుంటున్నారో చెబితే అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.
ఈ క్రమంలో వివేకా హత్య కేసు విచారణపై సుప్రీం కోర్టు సీబీఐకి పలు ప్రశ్నలు సంధించింది. వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తుపై ట్రయల్ కోర్టు తీర్పును వివేకా కుమార్తె సునీత సుప్రీంలో సవాలు చేసారు. ఈ పిటీషన్ పై జస్టిస్ ఎం ఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసింది. వివేకా హత్య కేసులో తదుపరి విచారణ అవసరమని భావిస్తున్నారా... అంటూ సిబీఐని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం పలు కీలక సూచనలు చేసింది. ముందుగా.. సునీత తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ట్రయల్ కోర్టుకు వెళ్లామని.. అక్కడ తదుపరి దర్యాప్తు అవసరమని పిటిషన్లో తాము పేర్కొన్న అంశాల్లో ఏ ఒక్కటీ ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదని వివరించారు. అంతేకాకుండా పిటిషన్లో పేర్కొనని అంశాలను పరిగణలోకి తీసుకుని పరిమితమైన మేరకే పాక్షికంగా దర్యాప్తునకు అనుమతి ఇచ్చారని.. అది న్యాయబద్ధం కాదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ధర్మాసనం.. వివేకా హత్య కేసులో తదుపరి విచారణ అవసరమని భావిస్తున్నారా అని సీబీఐని ప్రశ్నించింది. ఏయే అంశాలపై తదుపరి విచారణ అవసరమో స్పష్టంగా చెప్పాలని సీబీఐని కోరింది. ఎవరిని కస్టడీలోకి తీసుకొని విచారించాలని అనుకుంటున్నారో కూడా చెబితే దాన్ని పరిగణలోకి తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో ఇంకా ఎవరినైనా విచారించాల్సిన అవసరముందా అనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను అడిగి చెప్పగలమని.. దీనికి రెండు వారాల సమయం కావాలని సీబీఐ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos