ప్రతినెలా ఒకటో తేదీన గ్రామాలు కళకళలాడేందుకు పింఛన్లే ప్రధాన కారణమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో సీఎం పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడుతూ సూపర్సిక్స్ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఈ సందర్భంగా వేదికపై సీఎం డప్పు కొట్టారు. గత ప్రభుత్వ హయాంలో జీతాలు, పింఛన్లు సరిగా ఇవ్వలేదని చంద్రబాబు అన్నారు. తాము పేదలను ఆదుకునేందుకు 'పేదల సేవలో' కార్యక్రమం చేపట్టామని తెలిపారు. పింఛన్ల కోసమే నెలకు రూ.2,750 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ''రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చాం. విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని చెప్పాం. వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. గతంలో వ్యవస్థలన్నీ పడకేశాయి. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. అభివృద్ధి చేస్తాం.. సంపద సృష్టిస్తాం. పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచుతాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా వెళ్తున్నాం. సూపర్సిక్స్ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నాం. తల్లికి వందనం కింద రూ.10వేల కోట్లు జమ చేశాం. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. విశాఖలో నిర్వహించిన యోగాంధ్రతో 2 గిన్నిస్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ రికార్డులు నెలకొల్పామని' సీఎం చంద్రబాబు తెలిపారు.
ఇక, ఎవరైనా డ్రగ్స్, గంజాయి వాడితే తాట తీస్తామని హెచ్చరించారు… డ్రగ్స్ కు బానిసలై తల్లికి,చెల్లికి, పెళ్లానికీ తేడా లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు.. ఏ ఆడపిల్ల పైన అయినా చేయి వేస్తే అదే చివరి రోజు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. మరోవైపు లక్ష కుటుంబాలను దత్తత తీసుకునేందుకు పది వేల మార్గదర్శకులు ముందుకు వచ్చారని తెలిపారు చంద్రబాబు. రాష్ట్రానికీ పది లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.. గత వైసీపీ ప్రభుత్వంలో పోలవరం విధ్వంసం అయ్యింది.. డయఫ్రం వాల్ దెబ్బతిని నిర్మాణం జరగలేదని విమర్శించారు. కానీ, గడిచిన ఏడాదిలో పోలవరం ప్రాజెక్టు పనులు 6 శాతం పూర్తి చేశాం.. ఇప్పటికే 82 శాతం పనులు పూర్తి అయ్యాయని, పోలవరం ప్రాజెక్టును 2027కి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos