మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో పెను తుపాను సృష్టిస్తోంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ పేరు ఈ కేసులో ప్రముఖంగా వినిపించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ అంశంపై స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పుట్టా మహేశ్ కు ఎంపీ టికెట్ ఇస్తే, ఆయన ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి డ్రగ్స్ పార్టీలకు వెళ్లడం క్షమించరాని తప్పని, ఇలాంటి వారి ప్రవర్తన వల్ల పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి రావడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దురలవాట్లతో పార్టీ పరువు తీసే వారిని మోయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు.
టీటీడీ మాజీ చైర్మన్, ప్రస్తుత మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడైన మహేశ్... మంచి రాజకీయ నేపథ్యం ఉండి కూడా ఇలా ప్రవర్తించడం సరికాదని చంద్రబాబు హితవు పలికారు. ఇప్పటికే పార్టీ నుండి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయని, ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించామని గుర్తు చేశారు. వివరణ సంతృప్తికరంగా లేకపోతే కఠినమైన క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. నాయకులంతా ప్రజల్లో విశ్వసనీయతను కాపాడుకోవాలని, వ్యక్తిగత ప్రవర్తన విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. మరోవైపు మొయినాబాద్ డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ ప్రమేయంపై ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ ప్రమేయంపై ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం లోతుగా దర్యాప్తు ప్రారంభించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఇంటలిజెన్స్ విభాగం అధికారులు రంగంలోకి దిగారు. పుట్టా మహేశ్ నిజంగా డ్రగ్స్ తీసుకున్నాడా? తెలంగాణ పోలీసుల వాదనలో నిజమెంత? అసలు పుట్టా మహేష్ అక్కడకు ఎందుకు వెళ్లారన్న దానిపై ప్రధానంగా విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. ప్రధాన నిందితులతో పుట్టా మహేశ్ కు ఉన్న సంబంధాలు, డ్రగ్స్ పార్టీలు, ఇతర లావాదేవీలపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ మేరకు లోతైన విచారణ చేయాలని చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగారు.
ప్రధానంగా డ్రగ్స్ నెట్ వర్క్ ఎంపీకి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇందులోభాగంగా ఇంటెలిజెన్స్ అధికారులు ప్రత్యేకంగా విచారణ చేపట్టి చంద్రబాబుకు త్వరలోనే నివేదిక ఇవ్వనున్నారని తెలిసింది. డ్రగ్స్ కేసు ఎంపీ పుట్టా మహేష్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది. మరోవైపు ఈ కేసు అంశాలు ఎంపీ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ దర్యాప్తును వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది. గత ఘటనలు, ఫోన్ కాల్ డేటా ఆధారంగా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీతో పాటు ప్రభుత్వంపై ప్రభావం చూపడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos