టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై స్పందించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోవటంతో ఈసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేవినేని ఉమాకు అవకాశం దక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే ఊహించని విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇచ్చారు. కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో దేవినేని రియాక్షన్ ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై దేవినేని ఉమామహేశ్వరరావు తొలిసారిగా స్పందిస్తూ .. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్నికైన కావలి గ్రీష్మ, బీధ రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడుకు అభినందనలు తెలియజేశారు. శాసనమండలిలో పార్టీ. ప్రజల వాణిని వినిపించడంతోపాటు, ప్రతిపక్ష సభ్యుల విమర్శలను తిప్పికొట్టడంలో సమర్థవంతంగా పనిచేసి వైసీపీ దుర్మార్గపు నిర్ణయాలను, అవినీతిని ఎండగట్టాలని సూచించారు.
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎస్సీ, బీసీ, మహిళ, విద్యావంతుల సమ్మేళనంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని దేవినేని ఉమా అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు టీడీపీ వెన్నెముకలాంటిదన్న దేవినేని ఉమా.. వారికి సముచిత స్థానం కల్పించడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని మరోసారి రుజువైందన్నారు. చంద్రబాబు సాహసోపేతమైన నిర్ణయాలతో అభివృద్ధి కార్యక్రమాల్లో అందరిని భాగస్వామ్యం చేస్తున్నారని అన్నారు. అన్ని వర్గాలను ప్రోత్సహిస్తూ విద్యావంతులు, యువతకు పార్టీ సముచిత అవకాశాలు కల్పించిందని దేవినేని అభిప్రాయపడ్డారు.పార్టీ ఆవిర్భావం నుంచి యువత, విద్యావంతులు, వివిధ వృత్తులలో ఉన్నవారికి, మహిళలు, గ్రాడ్యుయేట్లకు పెద్దపీట వేసిన ఎన్టీఆర్ విధానాన్నే చంద్రబాబు కొనసాగిస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ దాష్టీకాలను ఎదిరించిన ప్రతిభా భారతి కుమార్తె, జస్టిస్ పుల్లయ్య మనుమరాలు గ్రీష్మ పెద్దల సభలో సమర్థవంతంగా తన వాణి వినిపించాలని కోరుకుంటున్నానన్న దేవినేని.. పార్టీ పదవి ద్వారా నెల్లూరు జిల్లాలో అందరిని సమన్వయం చేసి, రైతాంగ సమస్యలపై బీదా రవిచంద్ర యాదవ్ సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు న్యాయవాదులతో మాట్లాడి, పార్టీ అధినేతకు, కార్యకర్తలకు అనుసంధానకర్తగా వ్యవహరించారని బీటీ నాయుడును దేవినేని ఉమా ప్రశంసించారు. మరోవైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీడీపీ నేతలు బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మ సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజు అవకాశం దక్కించుకున్నారు. కూటమి సంఖ్యాబలం దృష్ట్యా ఐదు స్థానాలు టీడీపీ కూటమి ఖాతాలోకి వెళ్లనున్నాయి. దీంతో వీరంతా ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos