రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానం కోసం జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు హాజరుకాకపోవడాన్ని మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా విమర్శించారు. వారి వైఖరితోనే పార్టీ ఎమ్మెల్యేల నిజమైన చిత్తశుద్ధి బహిర్గతమైందని మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రజలు ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న రాజధాని చట్టబద్ధతపై విభజన చట్టంలో సవరణ చేయాలని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, ఈ నిర్ణయం పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి లోకేష్ అన్నారు.ఈ సందర్భంగా లోకేశ్ ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. పాదయాత్రతో చంద్రబాబుకు సినిమా చూపిస్తానని జగన్ అంటున్నారు. అయితే, ప్రజలు జగన్కు ఇప్పటికే చూపిన బ్లాక్బస్టర్ సరిపోలేదేమో అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
జగన్ చూపిస్తానంటున్న సినిమా 11 రోజులు కూడా ఆడదు అంటూ రివర్స్ పంచ్ వేశారు. మరోసారి ఏపీ ప్రజలు తుగ్లక్ పాలన చూడడానికి సిద్ధంగా లేరని ఆయన పేర్కొన్నారు. అమరావతి తీర్మానాన్ని రాష్ట్ర ప్రజలంతా హర్షిస్తున్నారన్నారు. జగన్ కు ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉందని ఇక అమరావతిని కూడా తాను నిర్మించానని అంటాడేమో అంటూ సెటైర్లు వేశారు. అమరావతి రాజధానిని మార్చాలని ఆలోచన జగన్ కి తప్ప ఎవరికీ రాదన్నారు. జగన్ పరామర్శల పేరుతో వివాదాలు సృష్టిస్తున్నారని మంత్రి లోకేష్ మండిపడ్డారు. అసెంబ్లీలో ఇంత ముఖ్యమైన చర్చ జరుగుతుంటే వైసీపీ అధినేత జగన్ బెంగళూరుకు వెళ్లారని గతంలో పరదాలు కట్టడం, చెట్లు నరికేయడం వంటివి ఇప్పుడు లేవని ప్రోటోకాల్ పైన వివాదాలు కూడా లేవని మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ చేసిన తీర్మానం ఏప్రిల్ 2న పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని లోకేశ్ తెలిపారు. ఈ విషయంలోనైనా వైసీపీ తమ స్పష్టమైన వైఖరిని తెలియజేస్తుందో లేదో చూడాలని ఆయన అన్నారు. ప్రజలు రైతులు రాజధాని అమరావతి పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అన్నారు. వైయస్ జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలకు వచ్చే నష్టమేమీ లేదని లోకేష్ అభిప్రాయపడ్డారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos