ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లబోతుంది ఎవరు అంటూ... రెండు, మూడు రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు పెద్దల్ని కలిశారు. ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానం కూటమిలో ఏ పార్టీకి ఇవ్వాలనేది ఇంకా క్లారిటీ రాలేదు.. ఈ అంశంపై అమిత్ షాతో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా అందుతున్న సమాచారం మేరకు బీజేపీకి ఈ ఎంపీ సీటు కేటాయిస్తారని చెబుతున్నారు.
ఈ క్రమంలో ఏపీ నుంచి రాజ్యసభ రేసులో ఒకటి, రెండు పేర్లు తెరమీదకు కూడా వచ్చాయి. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైను ఏపీ కోటాలో రాజ్యసభకు పంపిస్తారనే చర్చ జరుగుతోంది. అన్నామలైతో పాటు తాజాగా మరో పేరు కూడా వినపడుతోంది. మంగళవారం చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పాలన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం ఎన్నిక గురించి కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు కంటే ముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంద కృష్ణమాదిగ కూడా అమిత్ షాను కలిశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చినందుకు అమిత్ షాకు కృష్ణమాదిగ ధన్యవాదాలు తెలియజేశారు.
అమిత్ షాను కలిసిన తర్వాత కృష్ణమాదిగ ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి చంద్రబాబును కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ఆయన్ను కలిసి ధన్యవాదాలు తెలిపానన్నారు. ఈ క్రమంలో ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణమాదిగను పంపిస్తారనే చర్చ జరుగుతోంది. అయితే అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొత్తం మీద రాజ్యసభ స్థానం ఎన్నికకు బీజేపీ అధిష్టానం తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో పాటుగా మంద కృష్ణమాదిగ పేర్లను పరిశీలిస్తోందనే ఊహాగానాలు వినపడుతున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ నేతలు అధికారికంగా ధ్రువీకరించలేదు. మరి ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos