డెస్క్ : అనంతవరంలో నిర్వహించిన వన మహోత్సవంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ‘మా చిన్ననాటి కాలంలో మిత్రులకు ఇంటి చిరునామా చెప్పేటపుడు గుర్తులుగా చెట్ల పేర్లు చెప్పేవాళ్లం. మా ఇంటి ముందు ఫలానా చెట్టు ఉంటుందనో, వారి ఇంటి ముందు గోరింటాకు చెట్టు అంటూ ఆనవాళ్లు చెప్పేవాళ్లం. మనిషికి ఆనవాళ్లు చెట్లు, వృక్షాలే. వాటితో మన జీవనం.. జీవితం ముడిపడి ఉంద’ని పవన్ కళ్యాణ్ చెప్పారు. నా వ్యక్తిగత జీవితంలో ఇప్పటి వరకు పర్యావరణాన్ని పెంపొందించే దిశగా పలు కార్యక్రమాలు చేశానని, ఇక మీదట దాన్ని సమాజం మొత్తానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతానని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తాడికొండ నియోజకవర్గం, అనంతవరంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హాజరై మొక్కలను నాటి, అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. ఈ ఒక్క రోజే కోటి మొక్కలు నాటడం... వచ్చే ఏడాదికల్లా అయిదు కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
‘‘చెట్టు మనకు ఆధారం. చెట్లు లేని భూమిని ఊహించలేము. నల్లమల అటవీ పరిరక్షణ కోసం మూడు దశాబ్దాలుగా అలుపెరగకుండా పని చేస్తున్న కొమ్మిర అంకారావు గారి లాంటి వ్యక్తి జీవితం భావితరాలకు స్ఫూర్తివంతం. అంకారావు గారి గురించి తెలుసుకున్న కొద్దీ మరింత ఆసక్తిని కలిగిస్తుంది. పర్యావరణం, మొక్కల పెంపకం, అడవుల్ని సంరక్షించుకోవడం అనేది మనిషి ప్రాథమిక బాధ్యత అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. నేను ప్రతిసారి వ్యక్తిగతంగా పర్యావరణం గురించి చాలా పనులు చేశాను. ఇక వచ్చే ఏడాది ఇదే సమయానికి అయిదు కోట్ల మొక్కల పెంపకం అనేది లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తాను. ఆ అనుభవాలను వచ్చే ఏడాది మీ అందరి ముందు పంచుకుంటాను. కార్చిచ్చులు ఆపేందుకు గొర్రెల కాపర్లకు తగిన అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. వాటిని నివారించేలా ప్రణాళికతో ముందుకు వెళతాం అని పవన్ కళ్యాణ్ అన్నారు.
50% పచ్చదనం లక్ష్యం నిర్దేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు..
రాష్ట్రంలో పచ్చదనం మీద మేమంతా రకరకాల లెక్కలు చెబుతుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం కచ్చితంగా రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంపొందాలని బలంగా చెప్పారు. లక్ష్యాలను మాకు నిర్దేశించారు. ప్రకృతి పరిరక్షణ మీద, పర్యావరణం మీద అవగాహన కలిగిన గొప్ప ముఖ్యమంత్రి. దీనికి అనుగుణంగా మేం కూడా నగర వనాలు, అడవుల సంరక్షణ, కార్చిచ్చుల నిరోధం, మొక్కల పెంపకం మీద ఓ ప్రణాళికను నిర్దేశించుకొని ముందుకు వెళతాం. చంద్రబాబు హయాంలో నీరు – చెట్టు వంటి పనులు విజయవంతంగా నిలిచాయి. ఆయన విజన్ లో పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. చంద్రబాబు మార్గదర్శకంలో అద్భుతమైన పచ్చటి ప్రగతిని సాధించి, తగిన విధంగా బాధ్యతను నిర్వర్తిస్తాం’’ అన్నారు.
అంకారావును అటవీ శాఖ సలహాదారుగా నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వేదిక నుంచి ప్రకటించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos