అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై, యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీకి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు.అనంతరం సభను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. "అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు" అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. "యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసింది. యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు పలకడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా 175 దేశాల్లో ప్రజలు యోగాను ఆచరించడం అనేది ఒక సాధారణ విషయం కాదు" అని ప్రధాని పేర్కొన్నారు.
యోగా అనేది మానవత్వాన్ని పెంపొందించే ఒక సామూహిక ప్రక్రియ అని ప్రధాని మోదీ అభివర్ణించారు. "గత పదేళ్ల కాలంలో కోట్లాది మంది ప్రజల జీవితాల్లో యోగా వెలుగులు నింపింది. ఈ రోజు గ్రామగ్రామాల్లో యువతరం యోగాను తమ దినచర్యలో భాగంగా చేసుకుంటున్నారు. యోగా చేయడానికి వయసుతో ఎలాంటి సంబంధం లేదు. అలాగే యోగాకు ఎలాంటి హద్దులు లేవు" అని ప్రధాని మోదీ అన్నారు. యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని ఆయన సూచించారు.
యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఒత్తిడి తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. యోగాను భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన దార్శనిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. ఆయన ఐక్యరాజ్యసమితి ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించి, యోగాను ప్రపంచ ఆరోగ్య ఉద్యమంగా మార్చారు," అని కొనియాడారు. నేడు 175కు పైగా దేశాల్లో, 12 లక్షల ప్రదేశాల్లో 10 కోట్లకు పైగా ప్రజలు యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారని తెలిపారు. జాతీయత, ప్రాంతం, మతం, భాషలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను స్వీకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని మోదీ స్ఫూర్తితో ఏపీ రాష్ట్రంలో నెల రోజుల పాటు యోగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించామని, ఇందులో భాగంగా 1.44 లక్షల మంది యోగా శిక్షకులకు శిక్షణ ఇచ్చి, 1.4 లక్షల ప్రదేశాలలో 2.17 కోట్ల మందికి పైగా భాగస్వాములను నమోదు చేశామని సీఎం వివరించారు. ఒక్క విశాఖపట్నంలోనే నగరం నుంచి భోగాపురం వరకు 28 కిలోమీటర్ల మేర 3 లక్షల మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, మొత్తం 1.7 కోట్ల సర్టిఫికేట్లు జారీ చేశామని వెల్లడించారు. నిన్న 22,122 మంది గిరిజన విద్యార్థులు ఏకకాలంలో సూర్యనమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డు సాధించడం గర్వకారణమని, వారికి అభినందనలు తెలిపారు.
ప్రధానమంత్రి మోదీ యోగా, ప్రకృతి వైద్యం, హరిత ఇంధనం, స్వచ్ఛభారత్, ప్రకృతి వ్యవసాయం వంటివాటిని పునరుజ్జీవింపజేశారని, ఆయన దార్శనికత కేవలం ఆరోగ్యకరమైన ప్రపంచ సమాజం కోసమే కాకుండా, ఆరోగ్యకరమైన భూగ్రహం కోసం కూడా అని చంద్రబాబు ప్రశంసించారు. "ఒకే భూమి, ఒకే ఆరోగ్యం" స్ఫూర్తిని బలోపేతం చేయడానికి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి, సంతోషం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని సీఎం చంద్రబాబు అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos