ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి అవుతోంది. వైసీపీ లక్ష్యంగా కూటమి 2029 ఎన్నికలకు వ్యూహాలు అమలు చేస్తోంది. ప్రభుత్వం పైన ఇప్పటి కే వ్యతిరేకత పెరిగిందని చెబుతున్న జగన్.. ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. పలు కేసు ల్లో వైసీపీ ముఖ్య నేతలకు ఉచ్చు బిగుస్తోంది. ఇక.. వరుసగా నమోదైన కేసులతో వంశీ జైలులో ఉన్నారు. దీంతో, గన్నవరం లో కూటమి పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో జగన్ అలర్ట్ అయ్యారు. గన్నవరం కేంద్రంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
గన్నవరం నుంచి టీడీపీఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తరువాత ఆ పార్టీకి దగ్గరయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ, చంద్రబాబు, లోకేష్ లక్ష్యంగా ఫైర్ అయ్యారు. అనుచిత వ్యాఖ్యలు చేసారు. 2024 ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. వంశీ వైసీపీ లోకి వచ్చిన సమయంలో అక్కడ పార్టీ నేతలు యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామచంద్రరావును కాదని.. జగన్ తన పార్టీలోకి వచ్చిన వంశీకి ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా వెంకటరావు టీడీపీలోకి వెళ్లి.. అక్కడ నుంచి వంశీ పైన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇదిలా ఉండగా కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా నమోదైన కేసులతో వంశీ చాలా రోజులుగా జైల్లోనే ఉన్నారు.
వంశీ పైన ఎనిమిది కేసులు నమోదు కాగా, ఏడు కేసుల్లో బెయిల్ దక్కింది. వంశీ ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో వంశీకి మెరుగైన చికిత్స అందించాలని హైకోర్టు ఆదేశించింది. వంశీ అరెస్ట్ తరువాత గన్నవరంలో వైసీపీ కేడర్ డైలమాలో ఉంది. వంశీ సుదీర్ఘకాలం జైలులో ఉండటం.. నియోజకవర్గంలో కూటమి పార్టీలు తమ పట్టు పెంచుకునే ప్రయత్నంలో భాగంగా తమ పార్టీ నేతలకు గాలం వేయటంతో వారు అయోమయంలో ఉన్నారు. ఈ పరిస్థితిని గమనించిన జగన్ గన్నవరంలో పరిస్థితి పైన మాజీ మంత్రి పేర్ని నానితో చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వంశీ మద్దతు దారులు.. వైసీపీ కేడర్ తో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వంశీ సతీమణితోనూ మాట్లాడారు. వంశీ సతీమణి తో కలిసి పార్టీ కేడర్ తో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రేపు శనివారం గన్నవరంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వంశీకి మద్దతిస్తున్న వారు ఎవరో... తప్పుకునేది ఎవరో అనే వివరాలు బయటపడతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos