మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో నిందితుడిగా (ఏ2) ఉన్న సునీల్ యాదవ్, నాంపల్లిలోని సీబీఐ కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తులో సీబీఐ వైఖరిపై ఆయన పలు కీలక ప్రశ్నలను లేవనెత్తారు. కేసులో ఇంకా అనేక అంశాలు వెలుగులోకి రావాల్సి ఉందని తన పిటిషన్లో పేర్కొన్నారు. సునీల్ యాదవ్ తన కౌంటర్లో కొన్ని ప్రధాన సంఘటనలను ప్రస్తావించారు. "ఈ కేసులోని అప్రూవర్ దస్తగిరిని కడప జైల్లో డాక్టర్ చైతన్యరెడ్డి బెదిరించిన ఘటనపై సీబీఐ ఎందుకు దర్యాప్తు జరపలేదు.. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి ఓటమి వెనుక అవినాశ్ రెడ్డి కుట్ర కోణం ఉందని ఆరోపణలు వచ్చాయని ..దానిపై ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. అదేవిధంగా, ఈ కేసుకు సంబంధించి ఆరుగురు కీలక సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించారని, ఆ మరణాలపై సీబీఐ ఎందుకు దర్యాప్తు చేపట్టలేదని ఆయన నిలదీశారు. కల్లూరు గంగాధర్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందని అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా, అధికారులు అతనికి రక్షణ కల్పించడంలో ఎందుకు విఫలమయ్యారని అడిగారు. ఈ కేసులో ఇంకా చాలా మంది ప్రముఖులను విచారించాల్సిన అవసరం ఉందని సునీల్ యాదవ్ అభిప్రాయపడ్డారు. "ఈ కేసులో తాము తప్పు చేయలేదని చెబుతున్న మిగిలిన నిందితులు, దర్యాప్తును ఎందుకు అడ్డుకుంటున్నారు.. దర్యాప్తు వద్దని ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని ఆయన తన పిటిషన్లో ప్రశ్నించారు. ఈ కౌంటర్ పిటిషన్తో వివేకా కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos