కృష్ణా జిల్లాకు చెందిన రైతు గొప్ప మనసు చాటుకున్నారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామంలోని విద్యార్థుల హైస్కూల్ విద్య కష్టాలను తీర్చేందుకు అన్నే పద్మనాభరావు తన 2 కోట్ల రూపాయల విలువైన 50 సెంట్ల స్థలాన్ని ఉచితంగా దానం చేశారు. ఈ స్థలంలో జిల్లా పరిషత్ హైస్కూల్ భవనం నిర్మించనున్నారు. ఈ పాఠశాల భవనానికి అన్నే పద్మనాభరావు తల్లిదండ్రులైన రామలింగయ్య, రాజ్యలక్ష్మి పేర్లను పెట్టాలని నిర్ణయించారు. ఈ స్థలానికి సంబంధించిన పత్రాలను కలెక్టరేట్లో కలెక్టర్ బాలాజీకి అందజేశారు. విద్యాభివృద్ధి కోసం ఇంత విలువైన స్థలాన్ని దానంగా ఇవ్వడం చాలా ప్రశంసనీయమని కలెక్టర్ బాలాజీ అన్నారు. ఆయన అన్నే పద్మనాభరావు సేవలను అభినందించారు. విద్యాభివృద్ధికి చేసిన ఈ గొప్ప సేవను ప్రశంసించారు. ఉప్పులూరు గ్రామంలోని విద్యార్థులు హైస్కూల్ చదువు కోసం సుమారు నాలుగు నుండి ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యను పరిష్కరించడానికి, అన్నే పద్మనాభరావు ముందుకు వచ్చారు.
విద్యార్థుల సౌకర్యార్థం యూపీ పాఠశాల అభివృద్ధికి పద్మనాభరావు ఈ నిర్ణయం తీసుకున్నారు. సరైన పాఠశాల సౌకర్యాలు లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్నదని, కొందరు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చిన్నతనంలో పునాదిపాడు పాఠశాలలో చదువుకున్నానని, అప్పటినుంచి ఇప్పటివరకు తమ గ్రామంలో యూపీ పాఠశాలలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. తాను గన్నవరంలో కాలేజీకి వెళ్లానని ఆయన చెప్పారు. తనకు చదువుకునే అవకాశం ఉంది కాబట్టి ఇతర గ్రామాలకు వెళ్లి విద్యను అభ్యసించానన్నారు. ఇప్పటికీ గ్రామంలో అనేకమంది విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పద్మనాభరావు తెలిపారు.
గ్రామంలో ఎక్కువగా బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారని.. వారి ఉన్నత విద్యకు తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఈ ఆలోచనకు తమ కుటుంబ సభ్యులంతా సహకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పద్మనాభరావు తెలిపారు. తాను భూమిని విరాళంగా ఇస్తున్నప్పుడు, అంత ఖరీదైన భూమిని దానం చేయడంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, తమ నిర్ణయం మారలేదని దాత తెలిపారు. విద్యాశాఖ, జిల్లా పరిషత్ అధికారులు త్వరితగతిన పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. రూ.2 కోట్ల విలువైన భూమిని స్కూల్ కోసం దానం చేసిన పద్మనాభరావును అందరూ అభినందించారు. మొత్తం మీద పద్మనాభరావు తన సొంత ఊరి కోసం పెద్ద మనసుతో గొప్ప నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos