హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ ఘటన పై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు . డిసెంబర్ 4న సంధ్య థియేటర్ లో ప్రదర్శించిన ప్రీమియర్ షో కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చాడు. అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చిన సమయంలో, అక్కడి నుంచి వెళ్లే సమయంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంలో తొక్కిసలాటలో దిల్ సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే మహిళా మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు.
తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ అల్లు అర్జున్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప-2 ప్రీమియర్ షో చూసేందుకు రేవతి కుటుంబ సభ్యులు సంధ్య థియేటర్ కు వెళ్లారు. థియేటర్ ప్రాంగణంలో క్రౌడ్ ఎక్కువగా ఉన్నందున మీరు థియేటర్ వద్దకు రావద్దని అల్లు అర్జున్ కు పోలీసులు ముందుగానే చెప్పారు. అయినా అల్లు అర్జున్ అక్కడికి రావడంతో హీరోను చూసేందుకు వేలాది సంఖ్యలో అభిమానులు ఎగబడ్డారు. అల్లు అర్జున్ ర్యాలీగా రావడం వల్లనే ప్రమాదం జరిగింది. థియేటర్ వద్ద నుంచి వెళ్లి పోవాలని పోలీసులు అల్లు అర్జున్ కి చెప్పారు. అయినా అల్లు అర్జున్ సినిమా ముగిసిన తరువాత వెళ్లిపోతానని చెప్పాడు. రేవతి చనిపోయిన 11 రోజుల వరకు కూడా ఎవ్వరూ స్పందించలేదు. రేవతి చావుకు కారణం ఎవ్వరు.. మాపై విమర్శలు చేయడం సిగ్గు చేటని అన్నారు.
సినీ ప్రముఖులు అంతా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కలిసి వచ్చారని, తల్లి చనిపోయి.. తొమ్మిదేళ్ల పిల్లవాడు ఆసుపత్రిలో ఉంటే.. సినీ ప్రముఖులు ఎందుకు స్పందించడం లేదని సీఎం ప్రశ్నించారు. సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఏం ఆశిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. సంధ్య థియేటర్ లోంచి వెళ్లిపోయే ముందు కూడా అల్లు అర్జున్ ర్యాలీగా వెళ్లారని, వేల సంఖ్యలో అభిమానులు రావడంతో పరిస్థితి కంట్రోల్ కాలేదని, అందుకే తొక్కిసలాట జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
తొక్కిసలాట ఘటనపై కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికత్వం ప్రదర్శించాయని రేవంత్ విమర్శించారు. థియేటర్ లో ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబాన్ని, ఆ పిల్లవాన్ని హీరో పరామర్శించలేదు. అలాంటి మానవత్వం లేని వాళ్ళను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే పదేళ్లు మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. చావుకు కారణమైన వారిని పోలీస్ స్టేషన్ కు పిలిస్తే.. తప్పు పట్టి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఎంతో నీచమైన భాష వాడారనీ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని భావించి మా ప్రభుత్వం ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది. ప్రాణాలు బలి తీసుకుంటే వాళ్లను ఏమీ అనొద్దు అంటే ఇదేం న్యాయం. సినీ, రాజకీయ ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఏమైనా చేస్తారా.. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి లోబడే మా ప్రభుత్వం నడుచుకుంటోందనీ సీఎం అన్నారు. వ్యాపారాలు చేసుకోండి కానీ ప్రాణాలతో చెలగాటమాడటానికి మేం ఒప్పుకోమని, మేం అధికారంలో ఉన్నంత కాలం అలాంటి ఆటలు సాగవని హెచ్చరించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos