అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకాన్ని ముగించింది. తన బాబాయ్ శరద్ పవార్ నీడలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటికీ.. తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుని 'దాదా'గా గుర్తింపు పొందారు. అజిత్ పవార్ 22 జులై 1959న అహ్మద్నగర్ జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రి అనంత్రావు పవార్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవారు. 1982లో శరద్ పవార్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత చక్కెర సహకార పరిశ్రమలో బాధ్యతలు చేపట్టారు. 1991లో బారామతి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అయితే బాబాయ్ శరద్ పవార్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లేందుకు తన ఎంపీ సీటును త్యాగం చేసి, రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు.
అజిత్ పవార్ తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో అప్రతిహత విజయాలను అందుకున్నారు. 1995 నుంచి 2024 వరకు వరుసగా ఏడుసార్లు బారామతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఆరుసార్లు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక నేతగా రికార్డు సృష్టించారు. విలాస్రావ్ దేశ్ముఖ్, సుశీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్, దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ థాకరే, ఏక్నాథ్ షిండేల హయాంలో మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేశారు. కాగా 2022లో శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలేను రాజకీయ వారసురాలిగా ముందుకు తీసుకురావడంతో అజిత్ పవార్ అసంతృప్తికి లోనయ్యారు. 2023లో ఎన్సీపీ పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ-శివసేన (షిండే) ప్రభుత్వంలో చేరారు. పార్టీ పేరును, గుర్తును (గడియారం) దక్కించుకుని తాను నిజమైన ఎన్సీపీ వారసుడినని నిరూపించుకున్నారు. 2024 ఎన్నికల్లో కూడా తన బలాన్ని చాటుకున్నారు. అజిత్ పవార్కు భార్య సునేత్రా పవార్, ఇద్దరు కుమారులు పార్త్ పవార్, జయ్ పవార్ ఉన్నారు. తన తండ్రి మరణం తర్వాత చదువు మధ్యలోనే ఆపేసిన అజిత్ పవార్, పట్టుదలతో రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. అజిత్ పవార్ అకాల మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు. ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos