విద్యార్థి ఉద్యమ నేత, దేశం గర్వించదగ్గ కమ్యూనిస్టు ఉద్యమ నేతల్లో ఒకరైన సీతారాం ఏచూరికి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ - జెఎన్యు ఘనంగా నివాళులర్పించింది. జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విద్యార్థులు, ప్రొఫెసర్లు , వివిధ పార్టీల నేతలు పెద్దయెత్తున తరలి వచ్చి ఆ మహా నేతకు నివాళులర్పించారు. 'లాల్ సలామ్ లాల్ సలామ్ కామ్రేడ్ సీతారాం ఏచూరి' , 'ఏచూరి అమర్ రహే' అన్న నినాదాలతో జెఎన్యు ప్రాంగణం ప్రతిధ్వనించింది. ఏచూరికి జెఎన్యుతో విడదీయరాని అనుబంధం ఉంది.
అనంతరం కామ్రేడ్ సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఆయన స్వగృహానికి తరలించారు. అక్కడ ఆయన సహచరులు నివాళులు అర్పించారు. సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, బృందాకారత్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, ఏపీ సిఎం చంద్రబాబు, ఎస్ఎఫ్ఐ జాతీయ నాయకులు, ఇంకా అనేక మంది ప్రముఖులు నివాళులర్పించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి ఢిల్లీ వసంత్ కుంజ్లో గల ఏచూరి నివాసానికి వెళ్లి పార్థివ దేహంపై పుష్ఫగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ సీతారాం ఏచూరితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. ఓ మంచి రాజనీతిజ్ఞుడిని కోల్పోయామని అన్నారు. సామాజిక న్యాయం కోసం అహర్నిశలు పరితపించారని, పేదల సంక్షేమం కోసం 40 సంవత్సరాల పాటు సీతారాం ఏచూరితో కలిసి పోరాడానని చెప్పారు.
కాగా ఏచూరి భౌతిక కాయాన్ని ఈరోజు ఉదయం ప్రజల సందర్శనార్థం... ఆయన మూడు దశాబ్దాలుగా పని చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం ఎకెజి భవన్కు తరలించారు. మధ్యాహ్నం 3 గంటల తరువాత అక్కడి నుంచి ఎయిమ్స్ వరకు అంతిమయాత్ర సాగుతుంది. అనంతరం ఆయన కోరుకున్న విధంగా భౌతిక కాయాన్ని ఎయిమ్స్కు కుటుంబసభ్యులు అప్పగిస్తారు.
బతికినంత కాలం.. ప్రజల పక్షం వహించిన ఏచూరి, చావు తర్వాత కూడా ఈ దేశ ప్రజలకే ఉపయోగపడనున్నారు. వందల ఎకరాల్లో సమాధి కాకుండా.. ఒక మెడికల్ కాలేజీ ల్యాబ్లో వైద్య విద్యార్థుల కోసం ఉపయోగపడే 'రిసెర్చ్ మెటీరియల్' గా మారనున్నారు సీతారాం ఏచూరి. అంత్యక్రియలు చేయకుండా.. ఆయన చివరి కోరికగా.. తన పార్థివదేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడేలా ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి ఆయన కుటుంబ సభ్యులు అప్పగించనున్నారు. జీవితం మొత్తం ప్రజలకు అంకితం ఇచ్చి.. తనువు చాలించిన తర్వాత కూడా ప్రజలకే ఉపయోగడుతున్న ఏచూరి.. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారంటూ దివంగత నేతకు పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos