ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ జీ20 సదస్సు కోసం ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీలోని పలు ప్రాంతాల్ని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది జల్లెడ పట్టే పనిలో బిజీగా ఉన్నారు. జీ20 సదస్సు జరిగే సమయంలో రాజధాని ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగా ఆర్మీ పలు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. ముఖ్యంగా భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తోంది. ప్రపంచ దేశాలకు చెందిన అధినేతలు, ప్రతినిధులు వస్తుండటం వల్ల సెక్యూరిటీలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. సమావేశాలు జరిగే వేదిక సమీపంలో సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 8వ తేదీ ఢిల్లీకి చేరుకోనున్నందున... 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఢిల్లీ నగరం దాదాపు నాలుగు రోజుల పాటు నిఘా నీడలోనే ఉండనుంది. గూడ్స్ వెహికిల్స్ తిరగకుండా ఆంక్షలు విధించారు పోలీసులు. ట్యాక్సీలు, ఆటోలకూ ఈ ఆంక్షలు వర్తిస్తాయి. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం ఓ గెజిట్ విడుదల చేసింది. మొత్తం నగరాన్ని కంట్రోల్డ్ జోన్ గా ప్రకటించింది. కేవలం అధికారిక వాహనాలకు మాత్రమే అనుమతినివ్వనుంది ప్రభుత్వం. హౌస్ కీపింగ్, క్యాటరింగ్, వేస్ట్ మేనేజ్మెంట్, హాస్పిటల్స్కి సంబంధించిన వెహికిల్స్కి ఈ ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చింది. ఫుడ్ డెలివరీ సర్వీసెస్తో పాటు, మార్కెట్లను పూర్తి స్థాయిలో రెండు రోజుల పాటు మూసివేయనున్నారు. ఈ కంట్రోల్డ్ జోన్లోకి ఫ్లిప్కార్ట్,అమెజాన్తో పాటు స్విగ్గీ, జొమాటోలకూ అనుమతి లేదు. మెక్సికన్, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు ఢిల్లీకి రానున్నారు. ఎక్కువ మంది అధినేతలు, ప్రతినిధులు మాత్రం 8వ తేదీ వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే వారిలో అమెరికాతో పాటు పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఉన్నారు. వీరి భద్రతలో ఎలాంటి లోపాలు తలెత్తినా అది అంతర్జాతీయంగా భారత్ పరువు తీసే అవకాశం ఉంది. దీంతో కేంద్రం ఆర్మీతో పాటు ఢిల్లీ, ఇతర రాష్ట్రాల పోలీసుల్ని సైతం భారీఎత్తున దేశ రాజధానిలో మోహరిస్తోంది. అలాగే విదేశీ అతిధుల భద్రత కోసం ప్రత్యేక బలగాల్ని సైతం రప్పిస్తున్నారు. జీ20 సదస్సు సందర్భంగా దేశ రాజధానిలో భారీ ఎత్తున వాహనాల రాకపోకల్ని నియంత్రిస్తున్నారు. ఇప్పటికే రోడ్డు, రైలు రవాణాను దాదాపుగా నియంత్రించిన కేంద్రం.. ఇప్పుడు నగరంలోకి వచ్చే వాహనాల్ని పూర్తి స్ధాయిలో తనిఖీ చేయిస్తోంది. దీంతో ఈ నాలుగు రోజులు ఢిల్లీకి వెళ్లేందుకు ఇతర రాష్ట్రాల ప్రజలు జంకే పరిస్ధితి నెలకొంది. అక్కడే ఉన్నవారు కూడా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలు తమ ఉద్యోగులకు సెలవులు కూడా ప్రకటిస్తున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos