బీజేపీకి చెందిన అంశాల్లో కీలకమైన జమిలి ఎన్నికల నిర్ణయాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు జరిపే విధంగా పావులు కదుపుతోంది. దీనిపై విధివిధానాలు, సాధ్యాసాధ్యాల కోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేయగా... ఆ కమిటీ ఒక రిపోర్ట్ను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ఈ క్రమంలో ఆ కోవింద్ కమిటీ సిఫార్సులకు తాజాగా గురువారం నరేంద్ర మోదీ అధ్యక్షత భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం.. ఆమోదముద్ర వేసింది.
వాస్తవంగా ఈ కమిటీ సిఫార్సులకు కేంద్ర కేబినెట్ గతంలోనే ఆమోదం తెలిపింది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును లోక్సభ, రాజ్యసభల ముందుకు తీసుకురావాలని మోదీ సర్కార్ యోచిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జమిలి ఎన్నికల సిఫార్సులకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది.
దీంతో ఇక జమిలి ఎన్నికలకు సంబంధించిన సమగ్ర బిల్లు పార్లమెంట్ ముందుకు చర్చకు రానుంది. దేశంలో లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల దేశ ప్రగతికి ఆటంకం కలుగుతోందని బీజేపీ వాదిస్తోంది. కాగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని.. ఆ తర్వాత 100 రోజుల్లోగా రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని కోవింద్ కమిటీ సిఫారసు చేసింది. కమిటీ అయితే సిఫార్సు చేసింది కానీ ఆచరణలో ఇది అంత ఈజీయేనా అని రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos