రాష్ట్ర బీజేపీ ప్రవేశపెట్టిన ప్రయోగం విజయవంతమైనట్లుగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా... అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి కలిగిన వారి నుంచి బీజేపీ తొలిసారి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తులకు చివరి గడువు ఆదివారంతో ముగియడంతో భారీ సంఖ్యలో ఆశావహులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆ పార్టీ నాయకత్వం సెప్టెంబర్ 4 నుంచి 10 తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. మొత్తం 6011 దరఖాస్తులు వచ్చాయికానీ... చాలామంది ముఖ్య నేతలు దరఖాస్తులు చేసుకోకపోవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే సీనియర్లంతా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని జాతీయ నాయకత్వం ఆదేశించినా.. సీనియర్లు ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. పార్టీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక్కరే దరఖాస్తు చేసుకున్నారు. గోషామహల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాజాసింగ్ ను బీజేపీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇక.. మరొక ఎమ్మెల్యే అయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దరఖాస్తు చేసుకోలేదు. గజ్వేల్ నుంచి టికెట్ ఇవ్వాలని కోరుతూ ఈటల అభిమానులు అప్లికేషన్ దాఖలు చేశారు. మరోవైపు, ఈటల సతీమణి జమున పేరిట కూడా గజ్వేల్ నుంచి పోటీకి అవకాశం ఇవ్వాలని దరఖాస్తు వచ్చింది. అయితే ఇవి తాము చేసిన దరఖాస్తులు కావని.. తమ పేరిట అభిమానులు చేసి ఉంటారని ఈటల వర్గం చెబుతోంది. దరఖాస్తు చేయని వారిలో ఇంకా పలువురు సీనియర్లు కూడా ఉండటంతో బీజేపీ నాయకత్వానికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఎంపీలుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దరఖాస్తు చేసుకోలేదు. బండి సంజయ్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అదేవిధంగా... జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు సైతం దరఖాస్తు చేసుకోలేదు. ఇక దరఖాస్తు చేసుకున్నవారిలో ఎక్కువగా యువనేతలు, వారసులు ఉండటం గమనార్హం. దరఖాస్తుల గడువు ముగియడంతో ... ఇక ... నాయకత్వం ... దరఖాస్తులను వడబోసి... త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. ఎంపిక కాబోయే వారిలో ఆశావహులు ఎవరెవరు ఉంటారనేది ఆసక్తిగా మారింది. ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos