బ్యాంకుల విలీనానికి మరోసారి తెరలేపింది కేంద్ర ప్రభుత్వం. బ్యాంకుల కార్యకలాపాల సామర్థ్యం పెంచడం, ఖర్చుల హేతుబద్ధీకరణ చేపట్టడమే లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు దేశంలోని 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్బీ)లను 28కి కుదించనున్నట్లు పేర్కొంది. ఇందు కోసం ఒక రాష్ట్రం - ఒక ఆర్ఆర్బీ ప్రణాళికను అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. ఇప్పటికే బ్యాంకుల విలీనానికి సంబంధించిన చాలా పనులు పూర్తయినట్లు తెలిపింది. నాలుగో విడత బ్యాంకుల విలీనం త్వరలోనే పూర్తవుతుందని విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లు జాతీయ మీడియాలు కథనాలు ప్రచురించాయి.
ఏపీ, తెలంగాణలో.. విలీనం కానున్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 4 బ్యాంకులు ఉన్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటికే విలీన ప్రక్రియ పూర్తయింది. ఇక్కడ సేవలందించిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు శాఖలను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేశారు. ఇటీవలే ఈ ప్రక్రియ పూర్తయి తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆస్తులు, అప్పులను ఏపీజీవీబీ, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల మధ్య విభజించినట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు విలీనం కాబోతున్న బ్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్లో 4 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఇతర ఆర్ఆర్బీలను విలీనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఉత్తర్ ప్రదేశ్లో 3 బ్యాంకులు, పశ్చిమ బెంగాల్లో 3 బ్యాంకులు విలీనమవుతుండగా బిహార్, గుజరాత్, జమ్ము అండ్ కశ్మీర్ , కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో 2 చొప్పున బ్యాంకులు విలీనమవనున్నాయి.
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 50 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. 35 శాతం వాటా ప్రాయోజిత బ్యాంకు, 15 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉంటాయి. 2024, మార్చి 31వ తేదీ నాటికి ఆర్ఆర్బీలు 22,069 శాఖల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మొత్తం 26 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు (పుదుచ్చేరి, జమ్మూకశ్మీర్, లద్దాఖ్)ల్లో 700 జిల్లాల్లో ఈ బ్యాంకులు సేవలందిస్తున్నాయని బ్యాంకింగ్ అధికార వర్గాలు చెబుతున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos