తాను కాపాడిన ఓ వీధి కుక్కపిల్లను పార్లమెంట్ ప్రాంగణంలోకి తీసుకురావడంపై చెలరేగిన వివాదంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి స్పందించారు. తాను ఏ నిబంధనను ఉల్లంఘించలేదని, హిందూమతంలో శునకానికి అత్యంత గౌరవప్రదమైన స్థానం ఉందని, వాటిని పూజిస్తారని బుధవారం స్పష్టం చేశారు. అధికార పార్టీ కేవలం 'హిందువులం అని గొప్పలు చెప్పుకుంటుంది తప్ప, సొంత సంప్రదాయాల గురించి వారికి ఏమీ తెలియదని' ఆమె విమర్శించారు. సోమవారం రేణుకా చౌదరి తన కారులో కుక్కపిల్లతో పార్లమెంటుకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై ఆమె స్పందిస్తూ, "సంరక్షణ అవసరమైన ప్రతి కుక్కను, ప్రతి జంతువును నేను కాపాడతాను. హిందూమతంలో శునకానికి ఉన్నత స్థానం ఉంది. యుధిష్ఠిరుడు స్వర్గానికి వెళ్లినప్పుడు, ఆయనతో పాటు విశ్వాసపాత్రమైన శునకం మాత్రమే వెళ్లింది. వీళ్లకు (బీజేపీ) విశ్వాసం గురించి ఏం తెలుసు?" అని ప్రశ్నించారు. గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఎడ్లబండిపై పార్లమెంటుకు వచ్చిన విషయాన్ని కూడా ఆమె గుర్తుచేశారు. ఈ అంశంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పరోక్షంగా రేణుకా చౌదరికి మద్దతు తెలిపారు. విలేకరులు ఇదే విషయంపై ప్రశ్నించగా, "ఈ రోజుల్లో దేశం ఇలాంటి విషయాలనే చర్చిస్తోందని... పాపం ఆ కుక్కపిల్ల ఏం చేసింది? వాటిని ఇక్కడికి రానివ్వరా?" అని ఆయన అన్నారు. పార్లమెంట్లో పెంపుడు జంతువులకు అనుమతి లేదన్న విషయాన్ని గుర్తు చేయగా, "పెట్స్కు లోపలికి అనుమతి ఉంది" అని పార్లమెంట్ భవనం వైపు చూపిస్తూ వ్యాఖ్యానించారు. అయితే, రేణుకా చౌదరి తీరును బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. ఆమె చర్య పార్లమెంట్ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని విమర్శించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజు ప్రారంభమైన ఈ వివాదం, కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసి మరింత తీవ్రరూపం దాల్చింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos