ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ ఈ సారి లెఫ్ట్ పార్టీలను వదిలివేయడంతో కాంగ్రెస్.. ఆ రెండు పార్టీలతో కలవాలని భావిస్తోంది. మరోవైపు లెఫ్ట్ పార్టీలతోపాటు బీఎస్పీని కూడా తమ కూటమిలో చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై ఆయా పార్టీలతో కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు.
లెఫ్ట్, బీఎస్పీ పార్టీలతో చర్చించే బాధ్యతలను నాయకత్వం... సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించడంతో ఆయన రంగంలోకి దిగారు. సీపీఐ, సీపీఎం లకు రెండేసీ సీట్లను ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సానుకూలంగా ఉంది. అయితే లెఫ్ట్ పార్టీలు కోరుతున్న సీట్ల విషయంలో కాంగ్రెస్ నాయకత్వానికి ఇబ్బందులు ఉన్నాయి. సీపీఐ నాయకత్వం కొత్తగూడెం, సీపీఎం నాయకత్వం పాలేరు సీట్ల విషయంలో పట్టుదలతో ఉన్నాయని సమాచారం. ఈ విషయాలపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క లెఫ్ట్ పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఇదిలాఉంటే బీఎస్పీకి కూడా ఒక సీటును కాంగ్రెస్ పార్టీ కేటాయించే అవకాశం ఉంది. కాంగ్రెస్ తో పొత్తులు కుదరకపోతే తాము పోటీ చేసే స్థానాల జాబితాను సీపీఐ, సీపీఎంలు అక్టోబర్ 1న ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ తో పొత్తు లేకపోతే ఏం చేయాలనే దానిపై కూడా ఈ రెండు పార్టీలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చాయని తెలుస్తోంది.
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు లెఫ్ట్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. అయితే గత నెలలో బీఆర్ఎస్ 115 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ పరిణామంతో కేసీఆర్ తీరుపై లెఫ్ట్ పార్టీలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. ఈ పరిణామాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలను ప్రారంభించింది. లెఫ్ట్ పార్టీలతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ స్నేహ హస్తం చూపింది. సీపీఐ, సీపీఎం నేతలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇన్ ఛార్జి మాణిక్ రావు ఠాక్రే ఇప్పటికే చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తో వామపక్షాలు, బీఎస్పీ పొత్తు పెట్టుకునే పక్షంలో టికెట్ల విషయంలో వ్యవహారం బెడిసికొడుతుందా... లేక సానుకూలంగానే నడుస్తుందా అనేది ఉత్కంఠగా మారింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos