భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నూమూశారు. . శ్వాసకోశ సంబంధిత, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆగస్ట్ 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్సం పొందుతున్నారు. వెంటిలేటర్పై ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. చివరికి ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ సెప్టెంబర్ 12 గురువారం తుది శ్వాస విడిచారు.
తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సీతారాం ఏచూరి ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. ఆయన 25 రోజులుగా చికిత్స పొందుతున్నారు. 72 ఏళ్ల ఈ సీపీఎం నేతకు ఇటీవల క్యాటరాక్ట్ ఆపరేషన్ కూడా జరిగింది. అయితే ఇన్ఫెక్షన్ తొలగించేందుకు ఉపయోగించిన మందులు పనిచేయకపోవడంతో జపాన్ నుంచి ప్రత్యేక మందులు కూడా తెప్పించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ చికిత్స పొందుతూ ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. దీంతో కమ్యూనిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఒకసారి ఆయన జీవిత ప్రస్థానాన్ని పరిశీలిస్తే...
సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వాస్తవ్యులు. తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి ఏపీఎస్ ఆర్టీసీలో ఇంజినీర్గా పనిచేశారు. ఆయన తల్లి కల్పకం ప్రభుత్వ ఉద్యోగి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా ఏచూరి మేనమామ. హైదరాబాద్లో పెరిగిన ఏచూరి ఆల్ సెయింట్స్ హైస్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం కారణంగా ఉన్నత విద్యాభ్యాసం కోసం దిల్లీ వెళ్లారు. ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో ఇంటర్ పూర్తి చేసిన ఆయన సీబీఎస్ఈ పరీక్షల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్థికశాస్త్రం పూర్తిచేశారు. సీతారాం ఏచూరి అక్కడే పీహెచ్డీ చేస్తుండగా ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యారు.
సీతారాం ఏచూరి 1974లో సీపీఎం విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐలో చేరారు. 1978లో ఎస్ఎఫ్ఐ ఆలిండియా సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన ఆయన ఆ తర్వాత అనతికాలంలోనే ఎస్ఎఫ్ఐ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అప్పటివరకు బంగాల్, కేరళ రాష్ట్రాలకు చెందినవారే ఎస్ఎఫ్ఐ అధ్యక్షులుగా ఉండేవారు. ఆ రెండు రాష్ట్రాల నుంచి కాకుండా ఎస్ఎఫ్ఐ అధ్యక్షునిగా ఎన్నికైన తొలివ్యక్తిగా ఏచూరి ఘనత సాధించారు. 1975లో సీపీఎంలో చేరిన ఏచూరి 1984లో పార్టీ సెంట్రల్ కమిటీలో చోటు దక్కించుకున్నారు. 1985లో పార్టీ రాజ్యాంగ సవరణ కోసం సీపీఎం ఐదుగురు సభ్యులతో సెంట్రల్ సెక్రటేరియట్ను ఏర్పాటు చేసింది. అందులో ప్రకాశ్ కారత్, సునీల్ మొయిత్రా, పి.రామచంద్రన్, ఎస్.రామచంద్రన్ పిళ్లైతోపాటు సీతారాం ఏచూరి సభ్యులుగా ఉండేవారు.
1992లో జరిగిన సీపీఎం పార్టీ మహాసభల్లో ఏచూరి పొలిట్ బ్యూరోకు ఎన్నికయ్యారు. అనంతరం 2015లో విశాఖలో జరిగిన 21వ మహాసభల్లో సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు. 2018లో హైదరాబాద్లో, 2022లో కేరళలో జరిగిన 22, 23వ మహాసభల్లో సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఏచూరి తిరిగి ఎన్నికయ్యారు. 2004లో యూపీఏతో పొత్తు విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2005 జులైలో పశ్చిమ బెంగాల్ నుంచి సీతారాం ఏచూరి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2017 వరకు పెద్దల సభలో ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో ప్రజా సమస్యలను పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చారు.
సీతారాం ఏచూరి ఇంద్రాణి మజుందార్ను వివాహం చేసుకున్నారు. వారికి అశీష్ ఏచూరి, అఖిల ఏచూరి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అశీష్ ఏచూరి 2021లో కరోనా కారణంగా మృతిచెందారు. అఖిల ఏచూరి యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్బర్గ్, యూనివర్శిటీ ఆఫ్ సెయింట్ అండ్రూస్లో ఆచార్యురాలుగా పనిచేస్తున్నారు. సీతారాం ఏచూరి సీమాచిస్తీ అనే జర్నలిస్టును రెండోవివాహం చేసుకున్నారు. ఆమె ప్రస్తుతం ది వైర్ వార్తా సంస్థకు ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఏచూరి మృతికి కమ్యూనిస్టు నేతలతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos